యూస్‌లెస్ ఫెల్లో.. ఎమ్మెల్యే ముందే మున్సిపల్​ కమిషనర్, డీఈ రగడ

by Dishafeatures2 |
యూస్‌లెస్ ఫెల్లో.. ఎమ్మెల్యే ముందే మున్సిపల్​ కమిషనర్, డీఈ రగడ
X

దిశ, పరిగి : యూస్ లెస్​ఫెల్లో నేను కాదు నువ్వే యూస్ లెస్​ఫెల్లో అంటూ మున్సిపల్​ కమిషనర్, మున్సిపల్​ డీఈ ఒకరిపై ఒకరకు విరుచుకుపడ్డారు. పరిగి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి కంపు తిట్లదండకానికి దారితీసింది. ఏకంగా స్థానిక ఎమ్మెల్యే మహేష్​రెడ్డి ముందే అధికారులు ఒకరిపై ఒకరు తిట్లు సంధించుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్​కార్యాలయంలో శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో అవినీతి కంపు, దొంగ బిల్లలుపై మున్సిపల్​ కమిషనర్​ ప్రవీణ్​ కుమార్ ​రెడ్డి, మున్సిపల్​ డీఈ యూనూస్ ​ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 15 వార్డుల్లో కౌన్సిలర్లు చేసిన పనుల బిల్లులు చెల్లించడంలో ఆలస్యమవుతుందని కౌన్సిలర్లు సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఇందుకు కమీషనర్​ ప్రవీణ్​ కుమార్​రెడ్డి కల్పించుకొని మాట్లాడుతూ.. డీఈ పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని, అతనికి పనులు చేయడం చేతకాదని డీఈ యూనూస్​పై ఎమ్మెల్యే మహేశ్​రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇందుకు మున్సిపల్​ డీఈ యూనూస్ ​సమాధానం ఇస్తూ తప్పుడు లెక్కలు, దొంగ బిల్లులు పెట్టి రికార్డు చేయమంటున్నాడు ఎలా రికార్డు చేస్తారు అంటూ ఎమ్మెల్యే మహేష్​ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. నేను దొంగ బిల్లులు పెట్టానా యూస్​లెస్ ఫెల్లో నీకు పనిచేయడం చేతకాదు, నీకు జీతం ఇవ్వడం వేస్ట్ ​అంటూ కమిషనర్​ ప్రవీణ్​కుమార్​రెడ్డి విరుచుకుపడ్డారు. ఇందుకు డీఈ యూనూస్​ నన్నే యూస్​లెస్​ఫెల్లో అంటావా నువ్వే యూస్​లెస్​ ఫెల్లో అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకున్నారు.

టెండర్లు పిలవకుండానే పనులు చేస్తూ, చేసిన పనులకు కౌన్సిలర్లు, ఇతర కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కౌన్సిలర్లు మున్సిపల్​ కమిషనర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందంతా చూస్తున్న ఎమ్మెల్యే కొప్పుల మహేష్​రెడ్డి కల్పించుకొని అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఇలా సమావేశాల్లో తిట్టుకుంటారా, మరోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్​ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ది చేస్తామన్నారు. ఇదంతా చూస్తున్న పరిగి మున్సిపల్ ​ప్రజలు కమిషనర్​పై ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎవరి తోకచుట్టమని ఉపేక్షిస్తున్నారో అర్థం కావడం లేదని అనుకుంటున్నారు.

లేదా కమీషనర్​ చేస్తున్న అవినీతిలో ఎవరి చేతవాటం వాళ్లు చూసుకొని పైకి ఇలా మేకపోతు గాంభీర్యం వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని మరి కొందరు అనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​చైర్మన్​ ముకుంద అశోక్​కుమార్, వైస్​చైర్మన్​కల్లు ప్రసన్న లక్ష్మీ, కౌన్సిలర్లు అర్చన, వేముల కిరణ్​కుమార్​గుప్త, ఎదిరె కృష్ణ, జరుపుల శ్రీనివాస్, నాగేశ్వర్, మునీర్​, మున్సిపల్​ కో–ఆప్షన్​ సభ్యులు ముజమ్మిల్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed