సూరారంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అంతా వారికి తెలిసే జరుగుతోందా..?

by Disha Web Desk 19 |
సూరారంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అంతా వారికి తెలిసే జరుగుతోందా..?
X

దిశ, రామన్నపేట: మూసీ పరీవాహక ప్రాంతంలో ఇసుక మాఫియా ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ఇష్టానుసారంగా ఇసుకను తొవ్వి తమ వ్యవసాయ భూములలో డంపింగ్ చేసుకుంటూ.. అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. మూసీనది నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం, లక్ష్మాపురం, ఇంద్రపాలనగరం, మునిపంపుల, పల్లివాడ, సూరారం గ్రామాల మీదుగా మూసీనది ప్రవహిస్తూ ఉంది. కాగా, పరివాహక ప్రాంతాల గ్రామాలలోని కొంత మంది దళారులుగా ఏర్పడి ఇసుక వ్యాపారం చేస్తున్నారు. మూసీనది నుండి ట్రాక్టర్ల ద్వారా తీసుకొని గ్రామాలల్లో డంపింగ్ చేస్తూ.. రాత్రి వేళలో హైదరాబాద్‌కు లారీలలో తరలిస్తున్నారు. జిల్లా అధికారులు, ఇసుక రవాణా చేయకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నా.. వాటిని అమలు చేయడంలో మండల అధికారులు విఫలమయ్యారని స్థానికులు చర్చించుకుంటున్నారు.


వేసవి కాలం సమీపించినందున ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి.. తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మేధావులు చర్చించుకుంటున్నారు. వాగు నుండి ఇసుక తరలిస్తున్న సమయంలో ట్రాక్టర్లు పల్టీలు కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మద్యం మత్తులో రాత్రి వేళలో డ్రైవర్లు ఓవర్ స్పీడ్‌తో వాహనాలు నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా సంబంధిత అధికారులకు తెలిసే జరుగుతున్నదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మీడియా బృందం శుక్రవారం గ్రామాన్ని సందర్శిగా.. సూరారం గ్రామం ఇరువైపుల వందలాది ట్రాక్టర్లు, ఇసుక డంపింగ్‌లే దర్శనమిస్తున్నాయి. ఈ విషయంపై తక్షణమే పోలీస్, రెవెన్యూ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని మాఫియా ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed