'వాళ్లకి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసే దమ్ము లేదు'

by Disha Web Desk 13 |
వాళ్లకి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసే దమ్ము లేదు
X

దిశ, జగిత్యాల టౌన్ : రైతాంగం ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ..ఢిల్లీలో తమ అధికారిక విడిదిలో ధర్నా చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రూ.1500 కోట్లు వెచ్చించలేని దుస్థితితో వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. 15 లక్షల ఎకరాలు సాగు చేయలేకపోవడానికి కారణం ఈ ప్రభుత్వ విధానాలేనని విమర్శించారు.

మరో 15 లక్షల ఎకరాల్లో పండిన ధాన్యం కొనుగోలుకు రూ.1500 కోట్లు సాగు చేయని, 15 లక్షల ఎకరాలకు నష్ట పరిహారం రూ.1500 కోట్లు.. మొత్తం కలిపి 3 వేల కోట్లు వెచ్చించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. స్పష్టంగా కాంగ్రెస్ పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి వివరిస్తుంటే.. అవేమీ పట్టించుకోకుండా, ఏసీ, కూలర్లు పెట్టుకుని మరీ రైతుల పేరిట ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

పైగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని ప్రకటనలు గుప్పిస్తూ.. పార్లమెంట్ సమావేశాల సమయంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసే దమ్ము లేని టీఆర్ఎస్ నాయకులు తమ అధికార విడిది తెలంగాణ భవన్ లో ధర్నా చేయడం హాస్యాస్పదం అన్నారు. తాము కాంగ్రెస్ పక్షాన సైతం నిర్వహించే ఆందోళనలను ప్రభుత్వ కార్యాలయాల వద్దనైనా.. భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందైనా నిర్వహించేవారం అన్నారు. కానీ ధర్నాలు, ఆందోళనల పేరుతో తమ అధికారిక భవన్ లో ధర్నాలు చేయడం విడ్డూరం అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, పార్టీ నాయకుడు గాజంగి నందయ్య తదితరులున్నారు.

Next Story

Most Viewed