వీరు ఫెయిలైతే కేసీఆర్ ఫెయిల్ అయినట్లే.. ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
వీరు ఫెయిలైతే కేసీఆర్ ఫెయిల్ అయినట్లే.. ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, నేరేడుచర్ల: దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుబట్టి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం పాలకవీడు మండలంలోని కోమటికుంట గ్రామంలోని 33 మందికి దళితబంధు పథకం ద్వారా మంజూరైన పత్రాలను పంపిణీ చేశారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటంతోపాటు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. దళితబంధుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, ముందుగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పంపిణీ చేసి, ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల్లో దళితులకు లబ్ధి చేకూర్చనున్నారని అన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని పాలకవీడు మండలం కోమటికుంట గ్రామంలో 33 కుటుంబాలను, చింతలపాలెం మండలంలోని కిష్టాపురం గ్రామంలోని 67 కుటుంబాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఈ ఏడాది బడ్జెట్లో రూ.17700 కోట్లు దళితబంధు కోసం ప్రవేశపెట్టారని అన్నారు. కోమటికుంట గ్రామంలో 33 యూనిట్లకు గాను 11 రకాల వ్యాపారాలు చేసుకొనేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నందుకు వారిని అభినందించారు. మీ ఎదుగుదల మీదనే దళితబంధు పథకం ఆధారపడి ఉందని అన్నారు. మీరు నిలబడి సీఎం కేసీఆర్‌ను నిలబెట్టాలని అన్నారు. ఒక్కొక్క యూనిట్‌కు రూ.10 లక్షలకు గాను, తొమ్మిది లక్షల 90 వేలు లబ్ధిదారుల అకౌంట్లోకి చేరుతాయని, మిగిలిన పదివేలు దళిత బంధు నిధికి చేరుతాయని అన్నారు. దళితుల్లో నష్టపోయిన కుటుంబాలకు ఈ దళిత నిధి ద్వారా సహాయం అందిస్తామని అన్నారు. దళితబంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులు బాధ్యతగా పనిచేసి సీఎం కేసీఆర్ నమ్మకాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేశారని, ఈ పథకంలో వీరు ఫెయిల్ అయితే సీఎం కేసీఆర్ ఫెయిల్ అయినట్లేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం మీరు బాగుపడతారో.. సీఎం కేసీఆర్‌ను దోషిగా నిలబెడతారో.. లేదా సగర్వంగా నిలబెడతారో అది మీ చేతుల్లోనే ఉందని అన్నారు. కొండగుంట గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలని అన్నారు.

ఈ పథకంలో ఎక్కడా దళారీ వ్యవస్థ లేదని అవినీతికి పాల్పడి, ఇబ్బందులు పెడితే వెంటనే తనకు ఫోన్ చేయాలని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూచించారు. అవినీతికి పాల్పడితే ఏ స్థాయి అధికారినైనా వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఈ నియోజకవర్గంలో 20 వేల దళిత కుటుంబాలు ఉన్నాయని, 3,4 ఏళ్లలో దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేసి దళిత కుటుంబాలన్నింటికీ అందేలా చూస్తామని అన్నారు. అనంతరం 33 మంది లబ్ధిదారులకు మంజూరైన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డిని లబ్ధిదారులు సన్మానించారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరైన ట్రాక్టర్లు వాహనాలను అందజేసి పశువుల షెడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో దళితబంధు నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జెడ్పీ సీఈవో సురేశ్, ఎంపీపీ గోపాల్, జెడ్పీటీసీ మాలోతు బుజ్జి మోతిలాల్, సర్పంచ్ పెద్దారపు రామలక్ష్మమ్మ లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ బండావత్ యశోద రామారావు, నేరేడుచర్ల మార్కెట్ చైర్మన్ ఇంజమూరి యశోద రాములు, ఎమ్మార్వో శ్రీదేవి, ఎంపీడీవో జానయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కిష్టిపాటి అంజిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు మలమంటి దుర్గారావు, రైతుబంధు మండల అధ్యక్షులు దేవిరెడ్డి వెంకటరెడ్డి. పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, నేరేడుచర్ల జెడ్పీటీసీ రాపోలు నర్సయ్య, ఎంపీపీ జ్యోతినాయకులు, నాదెండ్ల శ్రీధర్, మునగాల సైదిరెడ్డి, కోటిరెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed