ఆర్మూర్ ఘటన పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు

by Batti.Sumithra |

హిందువుల ర్యాలీ నేపథ్యంలో తన నియోజకవర్గం ఆర్మూర్‌కు బయలుదేరుతుంటే పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్మూర్ ఘటన పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు
X

దిశ, కామారెడ్డి : హిందువుల ర్యాలీ నేపథ్యంలో తన నియోజకవర్గం ఆర్మూర్‌కు బయలుదేరుతుంటే పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి హిందువులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్‌ను అగ్నిగుండంగా మారుస్తున్నాయని ఆరోపించారు. వ్యక్తుల మధ్య జరిగిన ఘటనకు మతం రంగు పులుముతున్నారని, హిందువులు ఎన్నడూ మదర్సాకు వెళ్లి హనుమాన్ చాలీసా, గాయత్రి మంత్రం చదవాలని చెప్పలేదని అన్నారు. పెర్కిట్ పాఠశాలలో మత మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఐఎస్ఐతో సంబంధాలు ఉండి విదేశీ నిధులతో మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. "మేమేమైనా 35 లీటర్ల పెట్రోల్ డబ్బాతో తగులబెట్టామా ? కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో పొడిచామా ? ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టించామా ?" అని ప్రశ్నించారు. హిందువుల ఐక్యతను విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, ఈ ఘటన పై సీఎం స్పందించి తక్షణమే సిట్ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

విదేశీ నిధుల పై కూడా విచారణ జరపాలన్నారు. బీజేపీ నాయకుడు చేసిన చెంపదెబ్బను సమర్థించడం లేదని, దానికి హైదరాబాద్ నుంచి గుండాలను పిలిచి రచ్చ చేస్తున్నారని, దీంతో పగలు, ప్రతీకారాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు సంఘ విద్వేషాలు రెచ్చగొట్టే మాటలను నమ్మవద్దని, ఆర్మూర్ ప్రజలు ఆవేశానికి లోనుకావద్దని కోరారు. అరెస్ట్ చేసిన టీచర్‌ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అతని వెనుక విదేశీ శక్తులు, తీవ్రవాద సంస్థలు, మత మార్పిడి సంస్థలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరపాలన్నారు. మర్కజ్ కమిటీ, హిందూ సంఘాలు కలిసి మాట్లాడుకుందామని, అవసరమైతే అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేసుకుందామని సూచించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా హిందూ ముస్లింలందరం కలిసి ఉందామని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులను ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారో అందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో స్థానిక బీజేపీ నాయకులు నీలం చిన్న రాజులు, నరేందర్ రెడ్డి, శ్రీను, వైపుల్ జైన్, కాసర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Next Story