పాలమూరులో అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 13 |
పాలమూరులో అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వచ్చే ఏడాది నుంచి పాలమూరు జిల్లాలో వీర క్రీడలకు సంబంధించి అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు, ఎక్సైజ్ శాఖ మంత్రి ఈశ్వర్ గౌడ్ చెప్పారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను మంత్రి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత క్రీడా రంగానికి ఎంతో ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలలో రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి గుర్తు చేశారు.17 కోట్ల రూపాయల వ్యయంతో పాలమూరు జిల్లా కేంద్రంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.


9.2 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మించడంతో పాటు జిల్లా స్టేడియం గ్రౌండ్ లో ఆధునికీకరణకు 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని మంత్రి చెప్పారు. 70 ఏళ్ల చరిత్రలో పాలమూరు వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకుని గత పాలకులు అప్పులు తెచ్చి అందినంత దోచుకుని ఈ ప్రాంతాన్ని అధోగతి పాలు చేశారని మంత్రి ఆరోపించారు.


ప్రజలను కన్ఫీజ్ చేసేందుకు కొంతమంది క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని, అటువంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతరులతో కలిసి కాసేపు కబడ్డీ ఆడి అందరిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ నర్సింలు, వైస్ చైర్మన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.




Next Story

Most Viewed