పంచాయితీల్లో "పంచాయితీ.." మంత్రి సీతక్క క్లారిటీ

by Muthe.Rajitha |   (  Updated:2026-03-05 14:51:30  IST  )

గ్రామ పంచాయితీల్లో కొత్త - పాత సర్పంచుల మధ్య నెలకొన్న నిధుల వివాదానికి మంత్రి సీతక్క చెక్ పెట్టారు.

పంచాయితీల్లో పంచాయితీ.. మంత్రి సీతక్క క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ గ్రామ పంచాయతీలకు చేపట్టిన నిధుల పంపిణీ కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్న సంగతి తెలిసిందే. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన సుమారు రూ. 1,034 కోట్ల నిధులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగా వీటిపై పాత - కొత్త సర్పంచుల మధ్య గందరగోళం నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో డ్రైనేజీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు వంటి పనులు చేపట్టిన పాత సర్పంచులు, అప్పట్లో బిల్లులు రాక అప్పులపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ. 1,000 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఈ పాత బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇప్పుడు వచ్చిన నిధులు తమ హక్కు అని వారు భీష్మించుకు కూర్చున్నారు. మరోవైపు, అప్పుడే ఎన్నికల్లో గెలిచి ఉత్సాహంగా ఉన్న కొత్త సర్పంచులు.. తమ పదవీ కాలం ప్రారంభంలోనే నిధులన్నీ పాత బాకీలకే పోతే, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలని ప్రశ్నిస్తున్నారు. ఊరి అభివృద్ధి కోసం కొత్త పనులు చేపట్టకుండా కేవలం పాత అప్పులు తీర్చడానికే తాము పదవుల్లో ఉన్నామా అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి సీతక్క క్లారిటీ

ఈ ఉద్రిక్తతల మధ్య పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. పెండింగ్ నిధుల్లోంచి గతంలో చేపట్టిన మంచినీరు, పారిరిశుధ్య పనులకు సంబంధించిన బిల్లులు మాత్రమే క్లియర్ చేయాలని స్పష్టం చేసింది. అలాగే పంచియితీల్లో అందుబాటులో ఉన్న నిధుల్లో నుంచి మల్టీ పర్పస్ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలని కూడా సూచించారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొద్ది నిధులు మాత్రమే విడుదల చేయడం.. వాటిలో చాలా వరకు గత బకాయిలు చెల్లించడానికే వాడటం వల్ల, క్షేత్రస్థాయిలో ప్రస్తుతం చేపట్టాల్సిన పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల వంటి అత్యవసర మౌలిక వసతుల నిర్వహణకు కూడా నిధులు లేకుండా పోతున్నాయని కొత్త సర్పంచులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి, కేంద్రం నుంచి మిగతా నిధులు త్వరగా వచ్చేలా చూడాలని తెలంగాణ గ్రామ సర్పంచుల సంఘం కోరుతోంది.

Next Story