అసెంబ్లీలో చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసిన.. మంత్రి కొడాలి నాని

by Disha Web Desk 13 |
అసెంబ్లీలో చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసిన.. మంత్రి కొడాలి నాని
X

దిశ, ఏపీ బ్యూరో: దేశంలోనే చీప్‌ లిక్కర్‌ను కనిపెట్టింది చంద్రబాబేనని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం మన దురదృష్టకరమంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో జే బ్రాండ్‌కు లైసెన్స్‌ ఇచ్చిన నిష్ట దరిద్రుడు.. 240 బ్రాండ్లకు పర్మిషన్‌ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడేనంటూ మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో ఏపీలో అదే గతి పడుతుందని హెచ్చరించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొడాలి నాని.. చంద్రబాబు సభ బయట ఉండి..ఆ పార్టీ నేతలకు తప్పుడు డైరెక్షన్‌ ఇస్తున్నారని దుయ్యబట్టారు.


తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత వారుణి వాహిని అని పేరు పెట్టి సారాను సరఫరా చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన బ్రాండ్లు నేడు మార్కె్ట్‌లోకి వస్తే.. వాటిని సీఎం జగన్‌ తెచ్చినట్లు సిగ్గులేకుండా ఆర్జిమర్స్‌తో బాధపడుతున్న చంద్రబాబు ఆరోపిస్తున్నారంటూ మండిపడ్డారు. బ్రెయిన్‌ పని చేయక పిచ్చెక్కి మాట్లాడుతున్న చంద్రబాబుకు బుద్ధి లేదన్న మంత్రి కొడాలి నాని సభలో ఉన్న టీడీపీ సభ్యులకైనా ఆలోచన ఉండాలి కదా? అని అన్నారు. చంద్రబాబు హయాంలో 40 వేల బెల్ట్‌షాపులు తెరిస్తే.. రాష్ట్రంలో పర్మిట్‌ రూమ్‌లను, బెల్ట్‌షాపులను మూయించిన ఘనత వైఎస్‌ జగన్‌ది అని తీవ్ర విమర్శలు చేశారు.


ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సభ్యులు వైసీపీ ప్రభుత్వంపైనా.. సీఎం వైఎస్ జగన్‌పైనా చంద్రబాబు డైరెక్షన్‌లో తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. మీరైనా పార్టీ మారండి..లేదంటే అందరూ కలిసి కట్టకట్టుకొని ఏటైనా వెళ్లండి అంటూ టీడీపీ నేతలకు మంత్రి కొడాలి నాని సలహా ఇచ్చారు. టీడీపీని ఎవరు పట్టుకుంటే వారు సర్వనాశనం అవుతారంటూ మంత్రి కొడాలి నాని శాపనార్థాలు పెట్టారు.



Next Story

Most Viewed