పాడి పరిశ్రమతో.. రైతులకు ఉపాధి: మంత్రి హరీశ్ రావు

by Web Desk |
పాడి పరిశ్రమతో.. రైతులకు ఉపాధి: మంత్రి హరీశ్ రావు
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటైన 10 వేల కెపాసిటీ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ కేంద్రాన్ని, డైరీ పార్లర్‌ను సోమవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామంలో కరీంనగర్ డైరీ ఫామ్ నిర్మించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు వ్యవసాయం, పాడి పంట రెండు కవలలని, పాడి పరిశ్రమతో రైతులకు అనుకున్నంత ఉపాధి లభిస్తుంది.

రైతులకు పాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు.. మారుతున్న కాలానుగుణంగా సేంద్రీయంపై దృష్టి సారించి ఆవు పేడ, మూత్రాలను ఎరువులుగా మారుస్తూ.. ఎకరాకు లక్షన్నర రూపాయలు ఆర్జిస్తున్నారన్నారు. మన రైతులు కూడా ఆ దిశగా దృష్టి సారించాలని కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. రైతులకు ఎరువుల ధర పెంపు చేసి సబ్సిడీలో కోత పెట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై భారం వేస్తోందన్నారు.




రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతీ సంవత్సరం రాష్ట్ర జీఎస్‌డీపీలో 4 శాతం అప్పు రూపేణా తీసుకునే అనుమతి, అవకాశం ఉండేదని తెలిపారు. వచ్చే సంవత్సరానికి 3.5 శాతం ఎప్పటిలాగే తీసుకోవచ్చునని, కానీ ఒక అర శాతానికి కండిషన్ పెట్టిందన్నారు. ఆ కండీషన్ ఏమిటంటే.. విద్యుత్ చట్టంలో రిఫామ్స్-సవరణలు చేయాలని.. బాయిల వద్ద విద్యుత్ మీటర్లు పెట్టాలని మెలిక పెట్టిందన్నారు. బాయిల వద్ద మీటర్లు పెడితే అర శాతం మీ రాష్ట్రానికి అప్పు తీసుకునేందుకు అనుమతి ఇస్తామని.. దీంతో తెలంగాణకు 5 వేల కోట్ల కోత పడిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీలో 10 లక్షల కోట్లు, ఈ 10 లక్షల కోట్లలో అర శాతం 5 వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కోత పెట్టిందని పేర్కొన్నారు.

నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బాయిల వద్ద కరెంటు మీటర్లు పెట్టనని రైతు శ్రేయస్సుకై సీఎం కేసీఆర్ చెప్పారని.. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ 5 వేల కోట్ల రూపాయల కోసం శ్రీకాకుళం జిల్లాలో బాయిల వద్ద మీటర్లు పెట్టడం షురూ చేశారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతి యేటా పెట్టుబడి సాయం కింద రైతు బంధు, అలాగే రైతు బీమా.. ఇలా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఇతర ఏ రాష్ట్రాలలో అయినా ఇస్తున్నారా.. అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సహకారంతో నడిచే పాల డైరీలకు ప్రభుత్వం పారితోషికాన్ని అందిస్తున్నదని తెలిపారు.

కాళేశ్వరం నీళ్లు వచ్చాక పశుగ్రాసాన్నికి కొరత లేదని, ఆనాడు కేసీఆర్ తో చెక్ డ్యామ్ నిర్మాణాలు ప్రారంభమైన.. త్వరలోనే కస్తూరి పల్లి లో రూ.2.50 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. కరీంనగర్, విజయ, ముల్కనూరు పాల డైరీ లో రైతులంతా హక్కుదారులేనన్నారు. సహకార సంఘాలను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఆయిల్ ఫామ్, మల్బరీ సాగుకై రైతులు ముందుకు రావాలని, ఖమ్మం జిల్లా సత్తుపల్లి సందర్శనకు వెళితే కావలసిన ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. రైతుల సహకారంతో నడుస్తున్న పాల డైరీ సేవలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద పశువులకు హాస్టల్స్ నిర్మించుకునేలా ముందుకు వస్తే ఈజీఎస్ ద్వారా నిధులు మంజూరు చేయిస్తారని భరోసా ఇచ్చారు. పశువుల పెంపకం ద్వారా రసాయన ఎరువులు తగ్గించుకుని సేంద్రియ వ్యవసాయం సాగు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే నియోజకవర్గ పరిధిలోని నంగునూరు నర్మెట్ట, చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో సైతం మరోక యూనిట్ ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.



Next Story