'తులిప్' ఫ్లవర్స్.. పర్యాటకులను ఆకర్షిస్తున్న కశ్మీర్ పుష్పాలు

by Dishafeatures2 |
తులిప్ ఫ్లవర్స్.. పర్యాటకులను ఆకర్షిస్తున్న కశ్మీర్ పుష్పాలు
X

దిశ, ఫీచర్స్ : ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీరం ప్రస్తుతం 'తులిప్‌' అందాలతో తుళ్లిపడుతోంది. మంచు నగరంలో అడుగుపెట్టిన పర్యాటకులకు 'తులిప్' పూలు ముసిముసి నవ్వులతో స్వాగతం పలుకుతున్నాయి. దాల్‌ సరస్సుకు సమీపంలో ఉండే 'తులిప్ గార్డెన్' ఆసియాలోనే అతిపెద్దది కాగా.. ఇప్పుడు మిలియన్‌కు పైగా పుష్పాలతో ప్రపంచ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. కశ్మీర్‌ లోయలో పర్యాటక సీజన్‌ను ప్రారంభించేందుకు కశ్మీర్ ప్రభుత్వం ప్రతీ ఏట ఏప్రిల్‌లో తులిప్ ఫెస్టివల్‌ నిర్వహిస్తుండటం విశేషం.

సిరాజ్‌బాగ్‌‌లో సప్తవర్ణాలు

శతాబ్దాల నాటి నుంచే తులిప్స్‌తో కశ్మీర్‌ వాసులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఇంటి పైకప్పులు, పెరడుతో పాటు ఇంట్లోనూ వీటిని విరివిగా పెంచుకుంటుంటారు. ఈ చారిత్రక సంబంధాలకు అనుగుణంగానే 2007లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సిరాజ్ బాగ్‌ను ప్రారంభించింది. నెదర్లాండ్స్ సహా ఇతర యూరోపియన్ దేశాల నుంచి తులిప్ పూలను దిగుమతి చేసుకుని, దీన్ని అందమైన గార్డెన్‌గా తీర్చిదిద్దారు. అధికారికంగా సిరాజ్ బాగ్‌గా పిలవబడే 'ఇందిరాగాంధీ మొమోరియల్ గార్డెన్' మొత్తంగా 30 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

ఈ తోటలో తులిప్స్‌‌దే ప్రత్యేక ఆకర్షణ అయినప్పటికీ.. 'డాఫడిల్స్, హైసెన్, మస్కారీ' వంటి వివిధ రకాల పువ్వులు కూడా ఉంటాయి. ఈ మేరకు మొత్తం 68 రకాలకు చెందిన దాదాపు 15 లక్షల పూలు ఇక్కడ కొలువుతీరాయి. ఇక తులిప్ పుష్పాల సగటు జీవితకాలం మూడు నుంచి నాలుగు వారాలు. అయితే ఈ పూల మొక్కలను దశలవారీగా నాటినందున కనీసం ఒక నెల రోజులకు పైగా సందర్శకులను ఆకట్టుకుంటాయి.



Next Story

Most Viewed