ఎంజీ మోటార్ రెండో ప్లాంట్ ఏర్పాటు!

by Disha Web Desk 17 |
ఎంజీ మోటార్ రెండో ప్లాంట్ ఏర్పాటు!
X

న్యూఢిల్లీ: భారత్‌లో రెండో తయారీ యూనిట్‌ను ప్రారంభించనున్నట్టు ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా వెల్లడించింది. దీనికోసం కంపెనీ దాదాపు రూ. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు, ఇందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. అంతేకాకుండా 2023 నాటికి గుజరాత్‌లో ఉన్న కంపెనీ తయారీ ప్లాంట్ నుంచి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.25 లక్షల యూనిట్లకు పెంచాలని, రెండో ప్లాంట్ నుంచి అదనంగా మరో 1.75 లక్షల యూనిట్ల సామర్థ్యానికి చేరుకోవాలని లక్ష్యంగా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. తద్వారా ఏడాదికి కంపెనీ మొత్తం సామర్థ్యం 3 లక్షల యూనిట్లకు చేర్చనున్నది. రెండో తయారీ ప్లాంట్ ఏ ప్రాంతంలో ఉండనున్నదనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా చర్చిస్తున్నామని ఎంజీ మోటార్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ రాజీవ్ చాబా చెప్పారు.

జూన్ ఆఖరు నాటికి రెండో ప్లాంట్ ఎక్కడనే విషయాన్ని ఖరారు చేస్తామన్నారు. గతేడాదిలో సైతం ఎంజీ మోటార్ ఇండియా ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు రూ. 2,500 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. గతేడాది కంపెనీ మొత్తం 40 వేల కార్లను విక్రయించింది. సెమీకండక్టర్ల కొరత ఉన్నప్పటికీ మెరుగైన అమ్మకాలను సాధించాం. ఈ ఏడాదిలో 70 వేల వాహనాల అమ్మకాలను చేరుకుంటాం. వచ్చే ఏడాది నాటికి 1.25 లక్షల యూనిట్లను అమ్మగలమనే విశ్వాసం ఉందని రాజీవ్ వివరించారు. ప్రస్తుతం కంపెనీ హెక్టర్, గ్లోస్టర్, ఆస్టర్, జెడ్ఎస్ ఈవీ వంటి నాలుగు మోడళ్లను భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది. సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సరఫరా పెరుగుతుందని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed