నివాస ప్రాంతాల్లో 1,000 ఛార్జర్‌ పాయింట్లను ఏర్పాటు చేయనున్న ఎంజీ మోటార్ ఇండియా!

by Web Desk |
నివాస ప్రాంతాల్లో 1,000 ఛార్జర్‌ పాయింట్లను ఏర్పాటు చేయనున్న ఎంజీ మోటార్ ఇండియా!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని నివాస ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా గురువారం కొత్త వెంచర్‌ను ప్రకటించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా వెయ్యి రోజుల్లో 1,000 ఛార్జర్లను ఇన్‌స్టాల్ చేసే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు కంపెనీ తెలిపింది. ఇందులో కంపెనీ 1,000 ఏసీ ఫాస్ట్, టైప్ 2 ఛార్జర్లను ఏర్పాటు చేయనుంది. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కోసం సాధారణంగా ఉపయోగించే ఛార్జర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న వాటితో పాటు భవిష్యత్తులో మార్కెట్లోకి వచ్చే ఈవీలకు ఛార్జర్ పరిష్కారాలకు వీలవుతుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 'భారత్‌లో ఈవీ పరిశ్రమను మెరుగుపరిచే లక్ష్యంతో కంపెనీ కృషి చేస్తోంది. ఎంజీ ఛార్జింగ్ పాయింట్ల ద్వారా రానున్న రోజుల్లో ఈ విభాగంలో మెరుగైన సౌకర్యాలను అందించనున్నాం. వినియోగదారులు తమ ఈవీ వాహనాలకు ఛార్జింగ్ కోసం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనకుండా అభివృద్ధిని అందించనున్నట్టు' ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా అన్నారు. ఎంజీ మోటార్ ఇండియా భవిష్యత్తులో తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈవీ ఛార్జర్ మౌలిక సదుపాయాలను మరింత పెంచే చర్యలు తీసుకుంటుంది. ఈవీ వినియోగం పెంచేందుకు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉండే నివాస స్థలాల్లో సౌకర్యవంతమైన వాహన ఛార్జింగ్‌ను అందిస్తామని ఆయన వివరించారు. కాగా, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ ఇటీవలే ఫోర్టమ్, టాటా పవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.


Next Story

Most Viewed