ఇనుపయుగం నాటి 'మెన్‌హిర్'.. మరణించిన వ్యక్తి జ్ఞాపకార్థం : ఆర్కియాలజిస్ట్

by Dishafeatures2 |
ఇనుపయుగం నాటి మెన్‌హిర్.. మరణించిన వ్యక్తి జ్ఞాపకార్థం : ఆర్కియాలజిస్ట్
X

దిశ, ఫీచర్స్ : మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, బీచ్రాజుపల్లి గ్రామంలోని ఎల్లారిగూడెం వద్ద 'మెన్‌హిర్'గా పిలువబడే ఇనుప యుగంనాటి భారీ రాయి కనిపించింది. పురావస్తు, వారసత్వ అవశేషాలపై 'ప్రిజర్వ్‌ హెరిటేజ్‌ ఫర్‌ పోస్ట్‌టెరిటీ' ప్రోగ్రామ్ కింద మరిపెడ మండలంలో 'ప్లీచ్‌ ఇండియా' ఫౌండేషన్‌ సీఈవో, ఆర్కియాలజిస్ట్‌ ఇ. శివనాగిరెడ్డి చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆరడుగుల ఎత్తు, మూడు అడుగుల వ్యాసం కలిగిన 'మెన్‌హిర్'ను మరణించిన వ్యక్తి జ్ఞాపకార్థం నిర్మించినట్లు శివ నాగిరెడ్డి తెలిపారు. ఇనుప యుగానికి(3,500 సంవత్సరాలు) చెందిన ఈ నిర్మాణాన్ని మూడు అడుగుల లోతున పూడ్చిపెట్టారు.

మెన్‌హిర్ ల్యుకో గ్రానైట్(వాతావరణం, దాదాపు అతితక్కువ మాఫిక్ ఖనిజాలను కలిగి ఉంటుంది) రాతి వర్గానికి చెందిందని, భూగర్భ శాస్త్రపరంగా చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని జీఎస్‌ఐ మాజీ డైరెక్టర్ కె. మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాదు తెల్లటి రంగు రాయితో తయారు చేసిన ఈ మెన్‌హిర్‌‌ చరిత్ర భావితరాలకు తెలిసేలా వివరాలతో శిలాఫలకాన్ని ఏర్పాటుచేసి సంరక్షించాలని ఆయన కోరారు.

'మెన్‌హిర్, స్టాండింగ్ స్టోన్, ఆర్థోస్టాట్ లేదా లిత్' అనేది నిటారుగా ఉండే మానవ నిర్మిత రాయి. ఏకశిలగా లేదా సారూప్య రాళ్ల సమూహంలో భాగంగా యూరప్, ఆఫ్రికా, ఆసియా అంతటా విస్తృతంగా కనిపిస్తాయి. అయితే పశ్చిమ ఐరోపాలో అత్యధికంగా ఉండటం విశేషం. వీటికి సంబంధించి ఐర్లాండ్, గ్రేట్ బ్రిటన్, బ్రిటనీస్‌లోనే దాదాపు 50,000 ఉదాహరణలుండగా.. ఫ్రాన్స్‌లో 1,200 వరకు ఉన్నాయి. ఇవి పురాతన మతపరమైన వేడుకా స్థలాలుగా, కొన్నిసార్లు శ్మశాన వాటికలుగా దర్శనమిచ్చాయి.





Next Story