ప్రయాగరాజ్‌లో మౌని అమావాస్య ఎఫెక్ట్.. త్రివేణి సంగమంలో కోట్లాది మంది అమృత స్నానాలు

by Malleboina Mahesh |

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మాఘమేళా 2026లో 'రాజ స్నానం గా పిలిచే మౌని అమావాస్య వేడుకలు అంబరాన్నంటాయి.

ప్రయాగరాజ్‌లో మౌని అమావాస్య ఎఫెక్ట్.. త్రివేణి సంగమంలో కోట్లాది మంది అమృత స్నానాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మాఘమేళా 2026లో 'రాజ స్నానం గా పిలిచే మౌని అమావాస్య వేడుకలు అంబరాన్నంటాయి. గంగా, యమునా, అంతర్వాహిని సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఒక్క రోజే సుమారు 3 నుండి 4 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్యోదయానికి ముందే ప్రారంభమైన ఈ స్నానాల పర్వం రోజంతా కొనసాగుతోంది. భక్తులు మౌన వ్రతాన్ని పాటిస్తూ, పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఆధ్యాత్మిక చింతన లో మునిగిపోయారు.

భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని నియంత్రించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సుమారు 8 కిలోమీటర్ల మేర 24 ఘాట్లను సిద్ధం చేయగా, భద్రత కోసం 15,000 మందికి పైగా పోలీసులు, పారామిలటరీ దళాలను రంగంలోకి దించారు. ఏఐ (AI) కెమెరాలు, డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం వాటర్ అంబులెన్స్‌లు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను కూడా అందుబాటులో ఉంచారు. సంగమ తీరమంతా 'హర హర గంగే' నామస్మరణతో మారుమోగుతుండగా, కల్ప వాసులు తమ ఒక నెల రోజుల ఆధ్యాత్మిక దీక్షలో భాగంగా ఈ విశేష స్నానాన్ని పూర్తి చేసుకుంటున్నారు.

Next Story