పర్యాటక ప్రాంతమైన సోనామార్గ్‌లో భారీగా విరిగిపడ్డ మంచు చరియలు

by Malleboina Mahesh |

గతకొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్‌ తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా మంచు తుఫాను కొనసాగుతోంది.

పర్యాటక ప్రాంతమైన సోనామార్గ్‌లో భారీగా విరిగిపడ్డ మంచు చరియలు
X

దిశ, వెబ్ డెస్క్: గతకొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్‌‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా మంచు తుఫాను (snow storm) కొనసాగుతోంది. దీంతో పర్యాటక ప్రాంతాలు మొదట్లో కనివిందు చేసినప్పటికి హిమపాతం అధికమవడంతో రవాణా వ్యవస్థ (Transportation system) స్తంభించిపోయింది.. పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో మంచు తుఫాను అధికమవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. తాజాగా ఇలాంటి ఘటనే జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం (Tourist center) సోనామార్గ్‌ లో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఒక్కసారిగా భారీగా మంచు చరియలు విరిగి పడ్డాయి. రాత్రి సుమారు 10:12 గంటల సమయంలో సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో మంచు ఒక్కసారిగా భవనాలను కమ్మేసింది. ఈ భీకర దృశ్యాలు అక్కడ ఉన్న CCTV కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

అయితే, ఈ ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా కాశ్మీర్ లోయలో కురుస్తున్న భారీ హిమపాతం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో మంచు చరియలు విరిగి పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, సహాయక బృందాలు అప్రమత్తమయ్యాయి. పర్యాటకులు, స్థానికులు కొండ ప్రాంతాలకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్థానిక యంత్రాంగం సూచించింది.

Next Story