మల్లు స్వరాజ్యం జీవిత నేపథ్యం..

by Disha Web Desk 12 |
మల్లు స్వరాజ్యం జీవిత నేపథ్యం..
X

దిశ, నల్లగొండ: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు.



మల్లు స్వరాజ్యం గారు సాయుధ పోరాటంలో ఆదిలాబాద్ , వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. మహిళ కమాండర్ గా పని చేశారు. అప్పటి నిజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యం గారి ని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపు తో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచి పెట్టారు. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శి గా సుదీర్ఘకాలం పని చేశారు.


వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుంచి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుంచి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ తరఫున పనిచేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు.

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పని చేశారు. మల్లు స్వరాజ్యం గారికి ఒక కూతురు ఆమె పేరు పాదూరి కరుణ ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కూతురు పెద్ద కుమారుడి పేరు మల్లు గౌతమ్ రెడ్డి ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు కలదు చిన్న కుమారుడు మల్లు నాగార్జున రెడ్డి కి ఇద్దరు కుమారులు కలరు. వీరి చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతమ్ రెడ్డి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు చిన్న కుమారుడు మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా పని చేస్తున్నారు.

Next Story

Most Viewed