మల్లికార్జున ఖర్గే 'గుజరాత్' వ్యాఖ్యల వివాదం.. క్షమాపణలు కోరిన కాంగ్రెస్ అధినేత

by Malleboina Mahesh |

గుజరాత్ ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. తన మాటలను తప్పుగా చిత్రీకరించారని, ప్రజలపై గౌరవం ఉందని స్పష్టం చేశారు.

మల్లికార్జున ఖర్గే గుజరాత్ వ్యాఖ్యల వివాదం.. క్షమాపణలు కోరిన కాంగ్రెస్ అధినేత
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. గుజరాత్ ప్రజల (People of Gujarat) అక్షరాస్యతను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఉన్న గుజరాతీలు మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మలను దహనం చేశారు. అలాగే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన వ్యాఖ్యలపై స్పందించారు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే అందుకు తాను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు బుధవారం (ఏప్రిల్ 8, 2026) ప్రకటించారు. తన ప్రసంగంలోని కొన్ని భాగాలను రాజకీయ లబ్ధి కోసం కావాలనే తప్పుగా చిత్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రజల పట్ల తనకు ఎప్పుడూ అత్యంత గౌరవం ఉందని, వారిని తక్కువ చేసి మాట్లాడటం తన ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు.

అసలేం జరిగింది?

గత ఆదివారం కేరళలోని ఇడుక్కిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. కేరళ ప్రజలు విద్యావంతులని, వారు మోడీ మాటలకు మోసపోరని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో గుజరాత్ వంటి ప్రాంతాల్లోని "అక్షరాస్యులు కాని వారిని" (Illiterate) ప్రధాని సులభంగా నమ్మించవచ్చని ఆయన పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. గుజరాత్ అస్తిత్వాన్ని, ప్రజల తెలివితేటలను ఖర్గే అవమానించారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ ఒత్తిడి నేపథ్యంలో ఖర్గే సోషల్ మీడియా వేదికగా తన వివరణ ఇస్తూ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.

Next Story