మహబూబ్‌నగర్‌కు ప్రపంచ ఖ్యాతి.. గిన్నీస్ బుక్‌లో చోటు

by Disha Web Desk 2 |
మహబూబ్‌నగర్‌కు ప్రపంచ ఖ్యాతి.. గిన్నీస్ బుక్‌లో చోటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విత్తన బంతులను తయారు చేసి పచ్చదనాన్ని పెంపొందించడంలో మహబూబ్‌నగర్ జిల్లా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని వేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో అవార్డును గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం ఇచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గతేడాది మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు కేవలం 10 రోజుల్లో రెండు కోట్ల 8 లక్షల 24 వేల విత్తన బంతులను తయారు చేసి పచ్చదనం పెంపుదలలో రికార్డు సాధించిందన్నారు.

దేశంలోనే అతిపెద్దదైన 2087 ఎకరాలలో కేసీఆర్ అర్బన్ ఏకో పార్కును చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఏకో పార్కులో మినీ జూ ఏర్పాటు చేసేందుకు ఎంపీ నిధుల నుండి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ ప్రకటించారు. జిల్లా మహిళా సంఘాలు 2023లో 3 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, డీఆర్డీఓ యాదయ్య, పూర్వపు మెప్మా పీడీ శంకరాచారి, డీఐఓ సత్యనారాయణ మూర్తి, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఏపీడీ శారద, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖ, ఎఫ్ఆర్వో రంజిత్, డీపీఎం నాగమల్లిక, చెన్నయ్య, అనిల్, సుదర్శన్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed