పాకిస్తాన్ హ్యాండ్లర్‌తో లింకులు.. బీహార్ మదరసా నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన మధ్యప్రదేశ్ ఏటీఎస్!

by Malleboina Mahesh |

పాకిస్తాన్ లింకులున్న అంతరాష్ట్ర ఉగ్ర నెట్‌వర్క్ చేధన.. బీహార్ మదరసా నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన మధ్యప్రదేశ్ ఏటీఎస్ (MP ATS). ఇప్పటివరకు నలుగురు అరెస్ట్!

పాకిస్తాన్ హ్యాండ్లర్‌తో లింకులు.. బీహార్ మదరసా నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన మధ్యప్రదేశ్ ఏటీఎస్!
X

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ప్రేరేపిత హ్యాండ్లర్లపై దేశ వ్యాప్తంగా బలగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల్లో ఏటీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీహార్ మదరసా నిర్వాహకుడిని మధ్యప్రదేశ్ ఏటీఎస్ అరెస్ట్ చేశారు. దీంతో దేశంలో విస్తరిస్తున్న ఒక అంతరాష్ట్ర ఉగ్రవాద ప్రేరేపిత (Radicalisation Module) నెట్‌వర్క్‌ను ఏటీఎస్ చేధించింది. ఈ కేసుకు సంబంధించి బీహార్‌లో మదరసా నడుపుతున్న ఇజార్ ఉల్హాక్ అనే వ్యక్తిని తాజాగా అరెస్ట్ చేసింది. బీహార్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, లోకల్ పోలీసుల సహాయంతో మధుబని జిల్లాలో ఈ అరెస్ట్ జరిగింది. తాజా అరెస్టుతో ఈ ఉగ్ర నెట్‌వర్క్ కేసులో పట్టుబడిన వారి సంఖ్య నాలుగుకు చేరిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

అధికారుల సమాచారం ప్రకారం.. ఈ నెట్‌వర్క్ వెనుక పాకిస్తాన్‌కు చెందిన ఒక హ్యాండ్లర్ ఉన్నాడు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్ ద్వారా రహస్య ఆన్‌లైన్ గ్రూపులను నడుపుతూ, భారతీయ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా (Radicalise) బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నెట్‌వర్క్‌లో మొదటి అరెస్ట్ గత శుక్రవారం భోపాల్‌లో జరిగింది. అక్కడ మహ్మద్ ఫరాజ్ అనే హోమియోపతి క్లినిక్ ఉద్యోగిని అరెస్ట్ చేయగా, అతనిచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్ లోని సహారన్‌పూర్‌కు చెందిన నయీమ్ అబ్దుల్లా ఖురేషీని, రాజస్థాన్ లోని అల్వార్‌కు చెందిన మహ్మద్ షకీర్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి జిహాదీ సాహిత్యం, తీవ్రవాద వీడియోలు ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఏటీఎస్ సీజ్ చేసింది. ప్రస్తుతం బీహార్‌లో దొరికిన ఇజార్ ఉల్హాక్‌ను ట్రాన్సిట్ రిమాండ్‌పై బుధవారం మధ్యప్రదేశ్‌కు తీసుకువచ్చి విచారించనున్నారు.

Next Story