సెబీ కొత్త ఛైర్‌పర్శన్‌గా 'మాధబి పూరి'!

by Web Desk |
సెబీ కొత్త ఛైర్‌పర్శన్‌గా మాధబి పూరి!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు కొత్త ఛైర్‌పర్శన్‌గా మాధబి పూరి బుచ్‌ని నియమిస్తూ కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న చైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలం ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ బాధ్యతలను సెబీ మాజీ సభ్యురాలైన మాధబి పూరి బుచ్‌కు అప్పగిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆమె ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఛైర్‌పర్శన్‌గా ఓ మహిళను నియమించడం ఇదే మొదటిసారి. ప్రైవేటు రంగం నుంచి సెబీ కీలక పదవిలో బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగా కూడా ఆమె నిలవడం గమనార్హం. సెబీ ఛైర్‌పర్శన్‌గా మార్చి 1 నుంచి ఆమె బాధ్యతలను చేపట్టనున్నారు. సెబీలో సభ్యురాలిగా ఉన్న సమయంలో ఆమె నిఘా, పెట్టుబడి నిర్వహణ, కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ వంటి కీలక పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. సెబీలో హోల్ టైమ్ డైరెక్టర్‌గా 2017, ఏప్రిల్ నుంచి 2021, అక్టోబర్ వరకు ఉన్నారు. కాగా, మాధబి పూరి 1989లో ఐసీఐసీఐ బ్యాంకులో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 12 ఏళ్ల పాటు వివిధ బాధ్యతల్లో పనిచేశారు. అదేవిధంగా 2009-2011 మధ్యకాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు ఎండీగా, సీఈవోగా కీలక బాధ్యతలు కూడా నిర్వహించారు.



Next Story

Most Viewed