భారత్‌కు భారీగా చేరుతున్న ఎల్‌పీజీ నౌకలు: తీరనున్న గ్యాస్ కష్టాలు!

by Malleboina Mahesh |

భారత్‌కు చేరుతున్న 92 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ. నేవీ రక్షణలో శివాలిక్, నందా దేవి నౌకల రాక.. తీరనున్న దేశీయ గ్యాస్ కొరత.

భారత్‌కు భారీగా చేరుతున్న ఎల్‌పీజీ నౌకలు: తీరనున్న గ్యాస్ కష్టాలు!
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత (Gas shortage) నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో ఎదురైన అంతర్జాతీయ అడ్డంకులను అధిగమించి, సుమారు 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ (LPG) లోడ్‌తో వస్తున్న ‘శివాలిక్’ నౌక (Ship 'Shiwalik') ఈ రోజు తెల్లవారుజామున గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. దీనికి తోడు, అదే స్థాయిలో 46 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో వస్తున్న మరో భారీ నౌక ‘నందా దేవి’కి ఇండియన్ నేవీ పటిష్టమైన ఎస్కార్ట్‌ను కల్పిస్తోంది. యుద్ధ నౌకల రక్షణలో వస్తున్న ఈ నౌక కూడా అతి త్వరలోనే భారత తీరానికి చేరుకోనుంది. ఈ రెండు ప్రధాన నౌకల రాకతో దేశీయంగా గ్యాస్ సరఫరాలో ఉన్న ఇబ్బందులు చాలా వరకు తొలగిపోనున్నాయి.

గత రెండు రోజులుగా కూడా భారత్‌కు గ్యాస్ సరఫరా నిరంతరాయంగా అందుతోంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన మూడు గ్యాస్ నౌకలు (Gas vessels) ముంబై, విశాఖపట్నం పోర్టులలో లంగరు వేశాయి. వీటి ద్వారా సుమారు 80 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ దేశంలోని వివిధ పంపిణీ కేంద్రాలకు తరలి వెళ్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల దృష్ట్యా సరఫరాకు ఆటంకం కలగకుండా ఇండియన్ నేవీ, యు కోస్ట్ గార్డ్ అధికారులు నిరంతరం పహారా కాస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియా నుండి వచ్చే నౌకలకు సముద్రపు దొంగల నుంచి లేదా ఇతర దాడుల నుంచి ముప్పు ఉండటంతో, రక్షణ శాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

ప్రస్తుతం వస్తున్న శివాలిక్, నందా దేవి నౌకల ద్వారా మొత్తం 92 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రానుంది. ఇది దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న లక్షలాది గ్యాస్ బుకింగ్‌లను క్లియర్ చేయడానికి సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో, ముందు జాగ్రత్తగా మరిన్ని నౌకలను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. నౌకలు పోర్టుకు చేరుకోగానే గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్‌లకు యుద్ధ ప్రాతిపదికన తరలించి, వినియోగదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Next Story