లిక్కర్ పాలసీ కేసు: ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై హైకోర్టులో ఈడీ పోరాటం!

by Malleboina Mahesh |

కేజ్రీవాల్ విడుదల తీర్పులో ఈడీపై ట్రయల్ కోర్ట్ చేసిన వ్యాఖ్యల తొలగింపునకు హైకోర్టులో విచారణ. మార్చి 16కు వాయిదా వేసిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ.

లిక్కర్ పాలసీ కేసు: ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై హైకోర్టులో ఈడీ పోరాటం!
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన ఢిల్లీ మద్యం విధానం కేసు (Delhi Liquor Policy Case) ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi)లో ఉంది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత, మనీష్ సిసోడియా సహా ఇతర నిందితుల విడుదలకు సంబంధించి ట్రయల్ కోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారించింది. నిందితులను డిశ్చార్జ్ చేస్తూ ఫిబ్రవరి 27, 2026న ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులో ఈడీ దర్యాప్తు సంస్థపై కొన్ని తీవ్రమైన విమర్శలు చేసింది.

ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని (Expunge) కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈడీ తరపున హాజరైన అడిషనల్ సోలిసిటర్ జనరల్ (ASG) ఎస్.వి. రాజు వాదనలు వినిపిస్తూ, సిబిఐకి సంబంధించిన అంశాల్లో ఈడీపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని కోర్టుకు విన్నవించారు.

విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi) కీలక వ్యాఖ్యలు చేస్తూ, ట్రయల్ కోర్టు ఉత్తర్వులోని సంబంధిత పేరాలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తామని పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో కొన్ని అంశాలను గతంలోనే సవాలు చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఏఎస్‌జీ ఎస్.వి. రాజు నిందితుల విడుదల ఉత్తర్వులోని నిర్దిష్ట భాగాలను ఉటంకిస్తూ, దర్యాప్తు సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఆ వ్యాఖ్యలను తొలగించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఉభయ పక్షాల వాదనలను విన్న ఢిల్లీ హైకోర్టు, ఈ వ్యవహారంపై తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Next Story