ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం!

by Disha Web |
ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసీ ఐపీఓకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఇక తదుపరి ప్రక్రియపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో ఎల్ఐసీ అధికారులు భేటీ అయినట్టు తెలుస్తోంది. అలాగే, ఈ వారాంతంలో ఎల్ఐసీ అధికారులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) అధికారులతో సమావేశమవుతారని, అనంతరం భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించనున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎల్ఐసీ సంస్థ దరఖాస్తు చేసుకున్న తక్కువ సమయంలోనే సెబీ నుంచి అనుమతి సాధించడం విశేషం. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపు ఎల్ఐసీ ఐపీఓ పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది.

అయితే, అనూహ్యంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొనడం, తద్వారా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఐపీఓను వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయాలనే చర్చ కూడా జరుగుతోంది. గత వారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ప్రస్తుత పరిస్థితుల్లో తేదీని ఖరారు చేయలేదని, ఇంకొంత ఆలస్యమవ్వొచ్చనే సంకేతాలిచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు సైతం పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు పెట్టుబడికి దూరంగా ఉండొచ్చని తెలిపారు. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో ఎల్ఐసీ ఐపీఓ ఎప్పుడు, ఎంత ధరలో మార్కెట్లోకి రానున్నది తేలిపోతుంది. గత నెల దరఖాస్తు చేసిన డ్రాఫ్ట్ ప్రకారం ఎల్‌సీలో 5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. రూ. 10 ఫేస్ వాల్యూతో మొత్తం 31 కోట్లకు పైగా ఈక్విటీ షేర్ల మార్కెట్లోకి రానున్నాయి. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా దాదాపు రూ. 63 వేల కోట్ల వరకు ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తోంది.


Next Story

Most Viewed