జనశక్తి ట్విస్టులపై ట్విస్టులు.. గత వైభవం కోసమేనా..?

by Dishanational2 |
జనశక్తి ట్విస్టులపై ట్విస్టులు.. గత వైభవం కోసమేనా..?
X

దిశ, ప్రతినిధి, కరీంనగర్: ఇటీవల సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతంలో జనశక్తి కీలక సమావేశం ఏర్పాటు చేసిందన్న విషయం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనశక్తి కేంద్ర కమిటీ పేరిట విడుదల చేసిన మరోలేఖ సంచలనంగా మారింది. చాలా కాలం తరువాత పార్టీ పునరుజ్జీవం కోసం కార్య క్షేత్రంలోకి దిగిందని ప్రచారం విస్తృతంగా సాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కూడా జనశక్తి దళాల కదలికలు లేవని స్పష్టం చేశారు. అయితే తాజాగా మంగళవారం జనశక్తి కేంద్ర కమిటీ బహుజన్ (చంద్రప్రకాష్) పేరిట విడుదలైన లేఖ చర్చను మరో వైపు తీసుకెళ్లినట్టయింది. వాస్తవంగా జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేసిన కూర రాజన్న బారాబంకీలో అరెస్ట్ అయిన తరువాత బెయిలుపై విడుదల అయ్యారు. అప్పటికే ఆయన సోదరుడు అమర్ అలియస్ కూడా దేవేందర్ పూణేలో అరెస్ట్ కాగా అమర్ సతీమణీ విమలక్క కూడా జనజీవనంలోనే ఉన్నారు. జనశక్తి పురుడు పోసుకోవడానికి మూల కారకులైన 'కూర' బ్రదర్స్ సాధారణ జీవనం గడుపుతున్నారు. కానీ ఉన్నట్టుండి జనశక్తీ కీలక సమావేశం ఏర్పాటు చేసుకుందని పార్టీ పునర్నిమాణం జరగబోతుందన్న విషయం వెలుగులోకి రావడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

జనశక్తి పేరిట లేఖ

మరో వైపున జనశక్తి కేంద్ర కమిటీ పేరిట విడుదలైన లేఖ మరో చర్చకు దారి తీస్తోంది. జనశక్తి విశ్వనాథ్ అనే వ్యక్తి కార్యదర్శి కానే కాదని, రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాక్టివ్‌గా ఉన్నారని, జనశక్తి పేరిట ఆయుధాలు పట్టుకుని తిరుగుతన్న వారికి తమ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ నియమించిన కమిటీయే కాదని, వారంతా ప్రైవేటు శక్తులేనని బహుజన్ (చంద్ర ప్రకాష్) ఆ లేఖలో వివరించారు. విప్లవంపై నిజాయితీ ఉన్నట్టయితే తమను నేరుగా సంప్రదిస్తే బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. పార్టీకి చెందిన అధికారిక ఛానెళ్ల ద్వారా కలవాల్సి ఉంటుందన్నారు.

గత వైభవం కోసమేనా..?

అయితే సిరిసిల్ల అటవీ ప్రాంతంలో జనశక్తి పేరిట జరిగిన సమావేశాన్ని వ్యతిరేకిస్తూనే పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఈ లేఖ స్పష్టం చేస్తోంది. యూజీ కేడర్‌ను నియమించేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు కేంద్రకమిటీ విడుదల చేసిన లేఖ ద్వారా వెల్లడవుతోంది. అంటే విప్లవ పంథా వైపు అడుగులు వేస్తున్న వారిని అక్కున చేర్చుకుని సాయధ దళాలను రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయని అర్థం అవుతోంది. ఏది ఏమైనా జనశక్తి ఉనికి మాత్రం మరోసారి వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.




Next Story