సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు పనిచేస్తున్నాం.. నిరసనలు ఆపండి

by Disha Web Desk 17 |
సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు పనిచేస్తున్నాం.. నిరసనలు ఆపండి
X

కొలంబో: శ్రీలంకలో ప్రజలు నిరసనలు ఆపాలని ప్రధాన మంత్రి మహింద రాజపక్సే పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతి నిమిషం సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు పని చేస్తుందని అన్నారు. ప్రజలు రోడ్లపై చేసే నిరసనలతో ప్రతి నిమిషం డాలర్లను కోల్పోతున్నామని అన్నారు. సోమవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి తర్వాత మనం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని తెలిసి కూడా, మనం లాక్ డౌన్ అమలు చేశాం. ఆ కారణంగానే విదేశీ నిల్వలు పడిపోయాయి అని అన్నారు. అధ్యక్షుడితో కలసి తాను ప్రతి క్షణం దేశాన్ని సంక్షోభ పరిస్థితి నుంచి బయటపడేసే పరిష్కారాల కోసం చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసనలు ఆపాలని ఆయన కోరారు.

2010 ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత ప్రజలు అసలు కథను మరిచిపోయారు. కానీ, నేను గుర్తుంచుకున్నాను. భవిష్యత్తులో ఎలాంటి నిషేధాలు ఉండవని నేను హామీ ఇచ్చాను. పవర్ ప్లాంట్ కోసం మేము ప్రతిపాదన తీసుకొచ్చాం. గత ప్రభుత్వం దీనికి ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. దీనికి బాధ్యత వారే వహించాలి అని అన్నారు. మరోవైపు విపక్ష నేత సాజిత్ ప్రేమదాస మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్థిక విధానాలే దేశంలో ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయని అన్నారు.

మరోవైపు ప్రభుత్వం బయట నుంచి 3 బిలియన్ డాలర్ల సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆరు నెలల వరకు అవసరమైన వస్తువుల సరఫరాను పునరుద్ధరించేందుకు చూస్తుంది. కాగా, మరోవైపు దేశంలో సంక్షోభానికి బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు గొటబయె రాజపక్సే రాజీనామా చేయాలని విపక్షాలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరి నిరసనలు తెలుపుతున్నారు.

Next Story