బండి సంజయ్, MP అర్వింద్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-24 15:00:08  IST  )

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

బండి సంజయ్, MP అర్వింద్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ముఖ్యనేతలైన కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay), నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌(Dharmapuri Arvind)కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఐదు రోజుల్లో తనపై చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని డెడ్‌లైన్ పెట్టారు. లేకపోతే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువునష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.

రాజకీయాల కోసం దిగజారి ఆరోపణలు

తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వారిద్దరు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సాక్షాధారాలు లేకుండా కేవలం దురుద్దేశం పూర్వకంగా, నిజమైన రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ.. చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారు. ఈ మేరకు బండి సంజయ్, అరవింద్‌లకు కేటీఆర్ తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు.

డ్రగ్స్ కామెంట్స్‌ పూర్తిగా అవాస్తవం

బండి సంజయ్‌కు పంపిన నోటీసులో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం మరియు సరఫరా చేస్తున్నారంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని పేర్కొన్నారు. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేనని న్యాయవాదులు నోటీసులో వివరించారు.

Next Story