రేగొండలో సినీ ఫక్కీలో బాలుడి కిడ్నాప్..

by Disha Web Desk 13 |
రేగొండలో సినీ ఫక్కీలో బాలుడి కిడ్నాప్..
X

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మందల కేంద్రంలో బాలుడి కిడ్నాప్ కు గురైన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కోలే పాక మహేందర్ సునంద దంపతుల కుమారుడు కొలేపాక డేవిడ్ జాగారం లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఉగాది పండుగ కోసం భూపాలపల్లి మండలం అమ్మమ్మ గారి ఊరైన నిమ్మ గూడెం కు వెళ్ళాడు. తిరిగి ఆదివారం సాయంత్రం రేగొండకు వచ్చాడు. సోమవారం ఉదయం ఏడు గంటలకు టిఫిన్ తినడానికి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్ కు వెళ్తున్నాడు.

ఈ క్రమంలో కారు బాలునీ వద్దకు వచ్చి ఆపి గవర్నమెంట్ దావకాన ఎక్కడ ఉందాని అడిగినట్లు బాలు చెబుతున్నాడు. అక్కడ ఉంది అటు వెళ్ళండని చెప్పడంతో హాస్పిటల్ చూపించమని కారు ఎక్కించుకొని తీసుకు వెళ్లినట్లు చెప్తున్నాడు. కారులో ఇంకో ఇద్దరు బాలిక, బాలుడు ఉన్నట్లు కిడ్నాప్కు గురైన బాలుడు చెప్తున్నాడు. గవర్నమెంట్ దావఖాన దాటిన కారు ఆపక పోవడంతో ఏడుస్తూ ఉండడం తో మత్తు మందు ఇచ్చి పడుకో బెట్టినట్లు బాలుడు తెలిపాడు.


అక్కడి నుండి వరంగల్ మట్టెవాడ ప్రాంతానికి వెళ్ళగానే కారు ఆపడంతో అప్పటికి తెలివికి వచ్చి కారులో నుండి దూకి పక్కనే ఉన్న షాపుల వద్దకు పరిగెత్తినట్లు చెబుతున్నాడు. అక్కడ ఉన్న యువకులు బాలుని గమనించి వివరాలు అడిగి తెలుసుకొని చేతులకు ఉన్న తాడును విప్పి ఫోన్ నెంబర్ తెలుసుకొని బాలుని తల్లికి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఇంటి దగ్గర బాలుని కోసం వెతుకుతున్న తల్లి సునంద బస్సులో వరంగల్ కి వెళ్లి బాలుని తీసుకొని ఇంటికి వచ్చింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తల్లి సునంద పేర్కొంది. ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విచారణ చేపట్టామని పూర్తి వివరాలు తెలుసుకుంటామని ఎస్ఐ తెలిపారు.


Next Story