KIA: కొత్త వెర్షన్‌లను విడుదల చేసిన కియా ఇండియా!

by Disha Web Desk 17 |
KIA: కొత్త వెర్షన్‌లను విడుదల చేసిన కియా ఇండియా!
X

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా తన సెల్టోస్, సొనెట్ మోడళ్ల కొత్త వెర్షన్‌లను దేశీయ మార్కెట్లో శుక్రవారం విడుదల చేసింది. వీటి ధరలు సెల్టోస్ రూ. 10.19 లక్షలుగా, సొనెట్ రూ. 7.15 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత వినియోగదారులు ఈ మోడల్ కార్లను బాగా ఆదరించారని, అందుకే కొత్త వెర్షన్లలో కంపెనీ కొన్ని అదనపు ఫీచర్లను తీసుకొచ్చింది. కొత్త సెల్టోస్ వెర్షన్‌లో 13, సొనెట్‌లో తొమ్మిది కొత్త ఫీచర్లను జత చేశామన్నారు. ఇంకా పలురకాలైన అప్‌డేట్‌లతో పాటు భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా సైడ్ ఎయిర్‌బ్యాగులను అందించడం ద్వారా సరసమైన ధరల్లోనే 4 ఎయిర్‌బ్యాగులను వినియోగదారులకు అందిస్తున్నట్టు వివరించింది. అంతేకాకుండా ఇదివరకు ఉన్న పలు ఫీచర్లను కూడా తక్కువ వేరియంట్లలో కూడా ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

అలాగే, అధునాత కనెక్టివిటీని అందించేందుకు వాహనాలను కియా కనెక్ట్ యాప్‌తో అనుసంధానం చేశామని, కియా సెల్టోస్‌లో ఇంటిలిజెంట్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ ప్రవేశపెట్టామని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన కియా మోటార్స్ ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్.. కొత్తగా వెర్షన్‌లలో వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యమిచ్చాం. తక్కువ వేరియంట్లలో కూడా నాలుగు ఎయిర్‌బ్యాగులను అందిస్తూ, మెరుగైన ప్రమాణాలను పాటించాం. అదేవిధంగా సౌకర్యాలతో పాటు స్టైలింగ్‌లొ కూడా రాజీ పడకుండా సెల్టోస్, సొనెట్ మోడళ్లను తీసుకొచ్చామని చెప్పారు. కాగా, భారత మార్కెట్లో ఇప్పటివరకు కియా సంస్థ సుమారు 2.67 లక్షల యూనిట్ల సెల్టోస్, 1.25 లక్షల యూనిట్ల సొనెట్ కార్లను విక్రయించినట్లు వెల్లడించింది.



Next Story

Most Viewed