షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో నిందితుడు?

by Jakkula.Mamatha |

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం.

షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో నిందితుడు?
X

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ను కొత్తూరు మండలంలోని అక్కివేనిగూడెం సమీపంలో ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన అనంతరం పరారైన రాజ్‌కుమార్ కోసం పోలీసులు ప్రత్యేకంగా 9 బృందాలతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు ఉపయోగించిన కారును నిన్న చేగూరు రైల్వే లైన్ సమీపంలో గుర్తించిన విషయం తెలిసిందే. అలాగే అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ముందుకొచ్చింది.

స్థానికుల కథనం ప్రకారం ఆదివారం ఉదయం ముఖానికి మాస్క్ ధరించి టిఫిన్ సెంటర్ చిరునామా అడుగుతున్న వ్యక్తిపై అనుమానం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే అతడిని అదుపులోకి తీసుకున్నది స్థానిక పోలీసులా లేక ప్రత్యేక దర్యాప్తు బృందమా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. రాజ్‌కుమార్ అరెస్టుకు సంబంధించి అధికారిక ధృవీకరణ వెలువడాల్సి ఉంది. పోలీసులు అధికారికంగా ప్రకటించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ సమాచారం పై అధికారిక నిర్ధారణ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Next Story