'మిద్దె'పై సిరుల వరి.. 'ఉత్తమ రైతు'గా జయభేరి!

by Web Desk |
మిద్దెపై సిరుల వరి.. ఉత్తమ రైతుగా జయభేరి!
X

దిశ, ఫీచర్స్ : కేరళలోని కొల్లం నివాసి సుగంధ దేవికి వ్యవసాయం చేయాలనే ఆసక్తి ఉండేది. కానీ ఇంటి పనులతోనే సమయమంతా గడిచిపోయేది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తున్న ఓ మహిళా రైతు వీడియోతో ప్రేరణ పొందిన సుగంధ.. 300 గ్రో బ్యాగ్స్‌ ఉపయోగించి ఇంటి డాబాపైనే అగ్రికల్చర్ మొదలుపెట్టింది. నిజానికి 'మిద్దె తోట' అనగానే ఎక్కువ మంది కూరగాయలు, పూల మొక్కలు సాగుచేస్తుంటారు. కానీ సుగంధ మాత్రం అందుకు భిన్నంగా వరి సాగును ఎంచుకుంది. మరి ఇలాంటి కఠినమైన సవాల్‌ను ఆమె ఎలా స్వీకరించింది? ఎంత దిగుబడి సాధించింది?

వరి పంటను 'ఖరీఫ్, రబీ' రెండు సీజన్లలోనూ సాగు చేయొచ్చు. కానీ వర్షాకాలంలోనే అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇక మిద్దెపంట వేయాలనుకున్న సుగంధ.. తొలకరిలో 300 గ్రో బ్యాగ్స్‌లో విత్తనాలు నాటి 120 రోజుల్లోనే 45 కిలోల వరి పండించింది. దీనికితోడు టమోటా, క్యాబేజీ, మిరప, బఠానీ, బెండ, వంకాయ వంటి కూరగాయలను కూడా పండిస్తోంది. ఈ మేరకు ఆమె కుటుంబం పదేళ్లుగా సేంద్రియ ఆహారాన్నే స్వీకరిస్తుండగా.. 60 ఏళ్లకు చేరువవుతున్నందున ఇదే ఆరోగ్యానికి మేలని అభిప్రాయపడింది.

ఏడాదిలో ఒకేసారి వరి పంట వేస్తున్నాను. టెర్రస్‌పై విశాలమైన స్థలమున్న ఎవరైనా ఈ సాగు విధానాన్ని ప్రయత్నించవచ్చు. ఇందు కోసం మట్టి, ఇసుక/చెక్క దుమ్ము, ఆవు పేడ మిశ్రమాన్ని(1:1:1 నిష్పత్తి)లో వాడాలి. విత్తుకునే ముందు మిశ్రమాన్ని 14 రోజులు వదిలేసి ఎండిపోకుండా చూసుకోవాలి. ఇక పంట సాగును ప్రారంభించే ముందు అనుభవజ్ఞులైన రైతుల సలహాలతో పాటు విత్తనాల ఎంపిక ముఖ్యం. ప్రస్తుతం మా డాబాపైనే కాక, మా కూతురు ఇంటిపైన వ్యవసాయం చేస్తున్నాను. నా కష్టానికి గుర్తింపుగా మా పంచాయతీలో 'ఉత్తమ మహిళా రైతు'గా ఎంపియ్యాను.

- సుగంధ దేవి


Next Story

Most Viewed