స్వల్పంగా తగ్గిన తయారీ రంగ కార్యకలాపాలు!

by Disha Web |
స్వల్పంగా తగ్గిన తయారీ రంగ కార్యకలాపాలు!
X

న్యూఢిల్లీ: భారత తయారీ రంగ కార్యకలాపాలు మార్చిలో స్వల్పంగా తగ్గాయి. ఉత్పత్తి తక్కువ స్థాయిలో పెరగడంతో పాటు, కొత్త ఆర్డర్లు నెమ్మదించడం వల్ల తయారీ పీఎంఐ కాస్త క్షీణించింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ(పీఎంఐ) మార్చిలో 54 పాయింట్లుగా నమోదైంది. అంతకుముందు ఫిబ్రవరిలో 54.9గా ఉంది. 2021, సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి, అమ్మకాల్లో బలహీనమైన వృద్ధి రేటు ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా తెలిపింది.

సాధారణంగా పీఎంఐ సూచీ 50 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే వృద్ధిగా, తక్కువగా నమోదైతే క్షీణతగా పరిగణిస్తారు. 2021 చివరి నాటికి ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల తగ్గినప్పటికీ, ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్ల పీఎంఐసీ సూచీ ప్రతికూలంగా ఉందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పాలియానా డి లీమా అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం చివర్లో కెమికల్, ఎనర్జీ, ఫాబ్రిక్, ఆహార పదార్థాలు, మెటల్ ఖర్చులు ఫిబ్రవరి కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అంతేకాకుండా మొత్తం ద్రవ్యోల్బణం అత్యంత వేగంగా పెరిగింది. ఫిబ్రవరిలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల చమురు, వస్తువుల ధరల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతోందని, మరికొన్ని నెలల పాటు ఇదే ధోరణి ఉండవచ్చని ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా అంచనా వేసింది.


Next Story