భారత టెలికాం సంచలనం.. 132 కోట్లకు చేరిన చందాదారుల సంఖ్య

by Malleboina Mahesh |

భారత టెలికాం రికార్డు! 132 కోట్లకు చేరిన వినియోగదారులు. 51.9 కోట్ల చందాదారులతో జియో అగ్రస్థానం. 1.4 కోట్ల మంది నెట్‌వర్క్ మార్పిడి (MNP).

భారత టెలికాం సంచలనం.. 132 కోట్లకు చేరిన చందాదారుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ టెలికాం రంగం పరుగులు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రాయ్ (TRAI) నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 2026 చివరి నాటికి దేశంలోని మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 1,321.31 మిలియన్లకు (132.13 కోట్లు) చేరుకుంది. కేవలం ఫిబ్రవరి నెలలోనే రికార్డు స్థాయిలో 7.31 మిలియన్ల కొత్త చందాదారులు నెట్‌వర్క్‌లో చేరారు. బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో చోటుచేసుకున్న భారీ వృద్ధి ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచినట్లు తెలుస్తుంది. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య జనవరిలో 1,052.72 మిలియన్లు ఉండగా, ఫిబ్రవరి నాటికి అది 1,059.05 మిలియన్లకు పెరిగినట్లు సమాచారం.

మార్కెట్ లీడర్‌గా రిలయన్స్ జియో..

బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో రిలయన్స్ జియో 519.64 మిలియన్ల చందాదారులతో తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లు ట్రాయ్ (TRAI) నివేదిక స్పష్టం చేసింది. దీని తర్వాత భారతీ ఎయిర్‌టెల్ 364.14 మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా, వొడాఫోన్ ఐడియా (129.36 మిలియన్లు), బీఎస్ఎన్ఎల్ (28.70 మిలియన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా జియో (14.10 మిలియన్లు), ఎయిర్‌టెల్ (10.54 మిలియన్లు) ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దేశవ్యాప్త టెలి-డెన్సిటీ (Tele-density) 92.66 శాతానికి చేరుకోగా, పట్టణ ప్రాంతాల్లో ఇది అత్యధికంగా 142.32 శాతంగా నమోదైంది.

మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ (MNP) జోరు..

వినియోగదారులు తమకు నచ్చిన నెట్‌వర్క్‌కు మారే ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఫిబ్రవరి నెలలో ఏకంగా 14.47 మిలియన్ల మంది మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ (MNP) కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. ప్రైవేట్ టెలికాం సంస్థలు మార్కెట్‌లో 92.59 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తుండగా, ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వాటా 7.41 శాతానికి పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ పెరుగుతుండటం టెలికాం రంగ విస్తరణకు నిదర్శనంగా కనిపిస్తుంది.

Next Story