వంట నూనె నిల్వ పరిమితిని మరో ఆరు నెలలు పొడిగింపు!

by Disha Web Desk 17 |
వంట నూనె నిల్వ పరిమితిని మరో ఆరు నెలలు పొడిగింపు!
X

ముంబై: పెరుగుతున్న ధరలతో పాటు అధిక నిల్వలను అరికట్టేందుకు దేశీయ వంటనూనె స్టాక్ పరిమితిని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదివరకు ఈ ఏడాది జూన్ 30 వరకు ఉన్న గడువును డిసెంబర్ 31 వరకు పెంచారు. ప్రపంచంలోనే అత్యధికంగా వంట నూనెను దిగుమతి చేసుకునే దేశంలో, దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ పరిణామాల కారణంగా ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రిటైలర్ వ్యాపారులు మూడు టన్నుల వంట నూనెను నిల్వ చేసుకునే అవకాశం ఉండగా, టోకు వ్యాపారులు 50 టన్నుల వరకు స్టాక్ ఉంచుకోవచ్చు. ఈ నిబంధన తాజా ప్రకటనల అనంతరం ఈ ఏడాది చివరి వరకు వర్తిస్తుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు, భారత్‌కు రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి భారీ మొత్తంలో పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు ముడి పొద్దుతిరుగుడు నూనె సరఫరాలో సుమారు 4-6 లక్షల టన్నులు అంటే 25 శాతం వరకు కొరత ఏర్పడవచ్చని ఓ నివేదిక అభిప్రాయపడింది. భారత్ పొద్దుతిరుగుడు నూనె లో 70 శాతం ఉక్రెయిన్ నుంచి, 20 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. భారత్‌లో ఏటా 230-240 లక్షల టన్నుల వంటనూనె వినియోగంలో దాదాపు 60 శాతం దిగుమతుల పైనే ఆధార పడ్డాం. అలాగే, దేశానికి అవసరమైన 22-23 లక్షల టన్నుల పొద్దుతిరుగుడు నూనె లో ఉక్రెయిన్ 70 శాతం, రష్యా 20 శాతం, మిగిలిన మొత్తం అర్జెంటినా, ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతోంది. యుద్ధ పరిస్థితుల వల్ల ఏర్పడిన సరఫరా అంతరాయం వల్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో కొరత అధికంగా ఉండనుందని క్రిసిల్ వెల్లడించింది.


Next Story

Most Viewed