దళారుల వెరైటీ వసూళ్లు.. అందినకాడికి దోచుకునే యత్నం!

by Disha Web Desk 2 |
దళారుల వెరైటీ వసూళ్లు.. అందినకాడికి దోచుకునే యత్నం!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సామాన్యులను మభ్యపెట్టి వసూల్ చేసే రాజాలు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే సర్కారు భూమిని ఆక్రమించుకోవడంలో తమవంతు పాత్ర పోషించిన దళారులు ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ సమీపంలోని రేకుర్తి శివార్లలో ఓ ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇవ్వకున్నా ఇళ్లు నిర్మించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి లావాణీ పట్టాలు లేకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని కట్టిన ఇళ్ల డాటాను సేకరించారు. మంత్రి గంగుల కమలాకర్ వద్దకు కూడా బాధితులు వచ్చి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో రేకుర్తి శివార్లలోని ప్రభుత్వ భూమిని దురాక్రమణ చేసిన వారిని గుర్తించాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఒకే ఒక ప్రభుత్వ సర్వే నెంబర్‌‌లో 80కి పైగా ఇళ్లు వెలిశాయని గుర్తించి వాటికి రెడ్ మార్కింగ్ చేశారు.

ఎర్ర మార్కు పడ్డా ఏం కాదుపో..

అయితే, ఇప్పటికే కొంతమంది దళారులు జోక్యం చేసుకుని ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా విక్రయించారన్న ఆరోపణలు వచ్చాయి. ఒక్కో ప్లాటుకు ఇంత అని డబ్బులు వసూలు చేశారన్న ప్రచారమూ విస్తృతంగా సాగింది. ఈ విషయంపై కొంతమంది బాధితులు సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి గంగుల కమలాకర్ కూడా జోక్యం చేసుకుని ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆదేశించడంతో అక్రమణాల పర్వంపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఇప్పుడు సరికొత్త ప్రచారంతో పైరవీ కారులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. అందినకాడికి దోచుకోవలన్న లక్ష్యంతో సదరు దళారులు కబ్జాచేసిన స్థలం మీకు ఉండడమే కాదు.. ఇళ్లు కూలగొట్టకుండా ఉండేందుకు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామంటూ భరోసా కల్పిస్తున్నారని సమచారం.

ఒక్కో ప్లాటుకు విస్తీర్ణాన్ని బట్టి డబ్బులు తమకు ముట్టజెప్తే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని మాయమాటలు చెప్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో భూముల్లో ఇళ్లు కట్టుకున్న అమాయకులు వారి మాటలు నమ్మి డబ్బులు ముట్టచెప్పేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులతో కట్టుకున్న ఇళ్లు తీరా వేళకు రెవెన్యూ అధికారులు కూలగొట్టేందుకు నిర్ణయించుకుని రెడ్ మార్క్ వేయడంతో రోడ్డున పడ్తామన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఇదే అదనుగా భావించిన దళారులు తమ వంతు పాత్ర పోషిస్తూ ఒక్కొక్కరి నుండి రూ.50 నుండి లక్ష వరకూ డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం.



Next Story

Most Viewed