యథేచ్ఛగా ఇసుక రవాణా

by Disha Web Desk 12 |
యథేచ్ఛగా ఇసుక రవాణా
X

దిశ, రామన్నపేట: మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది ఇసుక అక్రమ రవాణా. కొంతమంది దళారులు గా ఏర్పడి.. ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల కళ్లుగప్పి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. అక్రమ దారుల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు. గత కొంతకాలంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు దాడులు చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. మండలంలోని లక్ష్మాపురం గ్రామ శివారులో మూసీ నది నుంచి ఇసుక రవాణా యధేచ్చగా కొనసాగుతుంది. రెవెన్యూ, పోలీసు శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భయం లేకుండా దళారులు రవాణా సాగిస్తున్నారు.

మూసినది లో జెసిబి సహాయంతో రాత్రివేళల్లో లారీలలో హైదరాబాద్ తరలిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు లక్ష్మాపురం శివారులోని మూసీ నది వాగులో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అని తెలియడంతో విలేకరుల బృందం వెళ్ళింది. బృందాన్ని దూరం నుంచి కనిపెట్టిన ఇసుక అక్రమ దారులు మూసీ నదిలో ఇసుక కుమ్మరించి వాహనాలు వదిలి పరారయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కి చేరుకున్నారు. ఇసుక కు అనుమతి ఇవ్వకూడదని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండడంతో అనుమతులు ఇవ్వడం లేదని రెవెన్యూ యంత్రాంగం తెలుపుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాఫియా ఆగడాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

తహశీల్దార్ వివరణ

ఈ విషయంపై తహశీల్దార్ వి ఆంజనేయులు ను వివరణ కోరగా ఇసుక రవాణా కోసం మండలం లో ఎవరికి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. గత 25 రోజులుగా అనుమతులు ఇవ్వలేదని ఎవరైనా మూసీ నది నుంచి అక్రమంగా ఇసుక ను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు.



Next Story

Most Viewed