బట్టీల్లో ఛిద్రమవుతున్న బాల్యం.. అధికార పార్టీ నేత పేరు చెప్పుకొని వ్యాపారం

by Dishanational2 |
బట్టీల్లో ఛిద్రమవుతున్న బాల్యం.. అధికార పార్టీ నేత పేరు చెప్పుకొని వ్యాపారం
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి తండా శివారులో, దోమకొండ వెళ్లే దారిలో ఇటుక బట్టీల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ప్రభుత్వానికి ఒక్క రూపాయి చెల్లించకుండా అన్ని ఫ్రీగా వాడుకుంటున్నారు అక్రమార్కులు. మట్టి నుంచి మొదలుకుని కరెంట్ వరకు అన్ని వారికి ఉచితమే. అయినా అధికారులు ఒక్కసారి కూడా ఇటుక బట్టీలపై దాడులు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారికి అధికారుల నుంచి పూర్తి అండదండలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. అధికార పార్టీకి చెందిన ఓ నేత పేరు చెప్పుకుని నిర్వాహకులు వ్యాపారం సాగిస్తున్నారు. దాంతో అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది.





బట్టీలకు ఉచిత కరెంట్

ఇటుక బట్టీలు నిర్వహించే వారు దర్జాగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. బట్టీలలో నివాసం ఉండటానికి, ఇటుకల తయారీకి ఉపయోగించే నీటికి వ్యవసాయ భూములకు ఉపయోగించే నీటి ద్వారా విద్యుత్ ను వాడుకుంటున్నారు. నిబంధనల ప్రకారం విద్యుత్ శాఖ ద్వారా బట్టీలకు అవసరమైన విద్యుత్ కోసం నిర్వాహకులు అనుమతి తీసుకుని దానికి సంబంధించి ఫీజులు, నెల వారి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవేమి అవసరం లేకుండా ప్రభుత్వానికి రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా విద్యుత్ ఉపయోగిస్తున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ వివరణ కోసం ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు.

మైనింగ్ నిబంధనలకు తూట్లు

ఇటుక బట్టీలకు ముఖ్యంగా మట్టి అధిక మొత్తంలో కావాల్సి ఉంటుంది. ఇటుకలకు కావాల్సిన మట్టిని పక్కనే ఉన్న చెరువులు, కుంటల్లో లభించే సారవంతమైన మట్టిని అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారు. మైనింగ్ నిబంధనల ప్రకారం సంబందిత శాఖ నుంచి తవ్వకాలకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి తీసుకున్నా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తవ్వకాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక్కడ అనుమతులు లేకుండానే దర్జాగా తవ్వకాలు చేపడుతున్నారు. అక్కడి నుంచి తెచ్చిన మట్టిని ఇటుక బట్టీలలో డంపింగ్ చేస్తున్నారు. చెరువుల్లో మట్టిని వ్యవసాయ భూములకు కావాలని రైతులు అడిగితే అనేక కొర్రీలు పెట్టె అధికారులు ఇటుక బట్టీలకు మాత్రం లోపాయికారికంగా అనుమతులు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. చెరువుల్లో లోయలను తలపించేలా లోతుగా తవ్వకాలు చేపడుతున్నా మైనింగ్, ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టిప్పర్ల ద్వారా అక్రమ మట్టిని బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

బట్టీలలో బాల్యం ఛిద్రం

ఇటుక బట్టీలలో పని చేయడానికి ఎక్కడి నుంచో కూలీలు వచ్చి పనులు చేస్తున్నారు. కుటుంబంతో సహా వస్తున్న కూలీల పిల్లలను బట్టీల్లోనే పనులకు పురామయిస్తున్నారు. ఐదేళ్ల చిన్నారుల నుంచి మొదలుకుని పదిహేనేళ్ల బాలలు బట్టీలలో పని చేస్తున్నారు. దాంతో చిన్నారుల బాల్యం మొత్తం బట్టీలలో గడిసిపోతుంది. పాఠశాలకు వెళ్లాల్సిన చిన్నారులకు పలక బలపం అంటే ఏమిటో తెలియకుండా పెరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అటువైపుగా వెళ్లడం లేదు. బాలల రక్షణ కోసం చేపడుతున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు అధికారుల కక్కుర్తితో నీరుగారిపోతున్నాయి.

అక్రమార్కులకు అధికారుల అండ..?

ఇటుక బట్టీల నిర్వహణ పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్న అక్రమార్కులకు అధికారుల నుంచి అండదండలు పుష్కలంగా ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రతి నెల వారికి రావాల్సిన మామూళ్లు తీసుకుంటూ అక్రమ వ్యాపారాన్ని అధికారులే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు బహిరంగానే వినిపిస్తున్నాయి. బట్టిల నిర్వహణపై చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్, రెవిన్యూ, విద్యుత్, ఇరిగేషన్ అధికారులు తనిఖీలు చేపట్టకుండా కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టినప్పుడు తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతూ.. చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, అక్రమంగా మట్టిని తోడేస్తూ వ్యాపారం చేస్తున్న ఇటుక బట్టిల నిర్వహణపై తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Next Story

Most Viewed