డిసెంబర్‌లో క్షీణించిన పారిశ్రామికోత్పత్తి!

by Web Desk |
డిసెంబర్‌లో క్షీణించిన పారిశ్రామికోత్పత్తి!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి మూడో వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆంక్షలతో పాటు ఆర్థిక కార్యకలాపాల్లో అంతరాయాల వల్ల భారత పారిశ్రామికోత్పత్తి వృద్ధి 10 నెలల కనిష్ఠానికి క్షీణించింది. గత ఏడాది డిసెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 0.4 శాతం పడిపోయిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తెలిపింది. అంతకుముందు నవంబర్‌లో ఐఐపీ సూచీ 1.3 శాతంగా నమోదైంది. సమీక్షించిన నెలలో తయారీ రంగంలో ఉత్పత్తి 0.1 శాతం దెబ్బతినగా, మైనింగ్ రంగంలో ఉత్పత్తి 2.6 శాతం, విద్యుదుత్పత్తి 2.8 శాతం పుంజుకున్నాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో బలహీనమైన సరఫరా, ప్రైవేట్ వినియోగంలో ఊగిసలాట కారణంగా 2.7 శాతం తగ్గింది. అలాగే, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు దెబ్బతినడంతో క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 4.6 శాతం క్షీణించింది. 'డిసెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి స్వల్పంగా వృద్ధి చెందుతుందని అంచనా వేశాం. అయితే, ఆర్థిక వ్యవస్థలో సానుకూల పరిణామాలు లేకపోవడం, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్స్యూమర్ నాన్-డ్యూరబుల్స్ విభాగాల్లో సంకోచం, మిగిలిన రంగాల్లో బలహీనమైన వృద్ధి వల్ల ఉత్పత్తి తగ్గిందని' ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త ఐదితి నాయర్ అన్నారు.


Next Story

Most Viewed