అబూ సలేంకు పెరోల్ ఇస్తే పారిపోతాడు.. బాంబే హైకోర్టులో మహారాష్ట్ర సర్కార్ అభ్యంతరం

by Kema Shiva Kumar |

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేం (Abu Salem) దాఖలు చేసిన పెరోల్ పిటిషన్‌పై ఇవాళ బాంబే హైకోర్టు (High Court of Bombay) విచారణ చేపట్టింది.

అబూ సలేంకు పెరోల్ ఇస్తే పారిపోతాడు.. బాంబే హైకోర్టులో మహారాష్ట్ర సర్కార్ అభ్యంతరం
X

దిశ, వెబ్‌డెస్క్: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేం (Abu Salem) దాఖలు చేసిన పెరోల్ పిటిషన్‌పై ఇవాళ బాంబే హైకోర్టు (High Court of Bombay) విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల మధ్య వాడివేడీ వాదనలు కొనసాగాయి. అబూ సలేంను బయటకు వదిలిపెడితే దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని, అదే జరిగితే భారత్-పోర్చుగల్ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మహారాష్ట్ర సర్కార్ (Maharashtra Government) బలంగా వాదనలు వినిపించింది. మరోవైపు అబూ సలేం న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ అన్న అబూ హకీం అన్సారీ గత ఏడాది నవంబర్‌లో మరణించాడని, అతడి అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 14 రోజుల అత్యవసర పెరోల్ కావాలని కోర్టును ఆశ్రయించినట్లుగా తెలిపారు.

భారత్-పోర్చుగల్ మధ్య సంబంధాలు దెబ్బతింటాయ్..

ఈ క్రమంలో ప్రభుత్వ తరఫు లాయర్ సలేం అంతర్జాతీయ నేరస్థుడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అతడికి 14 రోజుల పాటు పెరోల్ ఇవ్వడం భద్రతా దృష్ట్యా సాధ్యం కాదని కోర్టుకు విన్నవించారు. అబూ సలేంను పోర్చుగల్ నుంచి కొన్ని ప్రత్యేక షరతులతో భారత్ తీసుకొచ్చింది. ఒకవేళ పెరోల్‌పై బయటకు వచ్చి అతను పారిపోతే, అది భారత్-పోర్చుగల్ మధ్య ఉన్న అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన అవుతుందని, ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని ప్రభుత్వం వాదించింది. భద్రతా కారణాల దృష్ట్యా సలేంకు కేవలం 2 రోజుల పెరోల్ మాత్రమే మంజూరు చేయవచ్చని, అది కూడా భారీ పోలీస్ ఎస్కార్ట్ మధ్య ఉండాలని సర్కార్ సూచించింది. అంతేకాకుండా, ఆ ఎస్కార్ట్ ఖర్చులను కూడా సలేం తానే భరించాలని స్పష్టం చేసింది. దీంతో సలేం ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామం అజంగఢ్‌కు వెళ్లాల్సి ఉందని, ప్రయాణ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2 రోజులు ఏమాత్రం సరిపోవని అతని న్యాయవాది ఫర్హానా షా వాదించారు. ప్రస్తుతం అబూ సలేం పెరోల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

Next Story