కబ్జాలకు పాల్పడే వారు ఎవరైనా వదిలిపెట్టం: రంగనాథ్ హెచ్చరిక

by Gantepaka Srikanth |

చెరువుల పరిరక్షణలో హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ స్పష్టం చేశారు.

కబ్జాలకు పాల్పడే వారు ఎవరైనా వదిలిపెట్టం: రంగనాథ్ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువుల పరిరక్షణలో హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ స్పష్టం చేశారు. ఆక్రమణలను అడ్డుకోవటమే కాదు వాటిని ఆరోగ్యకరమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. చెరువులు ఇకపై పిల్లలకు యువతకు పెద్దల ఆరోగ్యానికి క్రీడలకు ఆలవాలంగా మారుస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, చెరువుల అక్రమణుల తొలగింపులు హైడ్రా ఇక ముందు కూడా దూకుడుగానే ముందుకు పోతుందని అన్నారు పేదల ఇళ్లను హైడ్రా కూల్చదని అదే సమయంలో పేదలను ముందు పెట్టి ఆక్రమణలు చేసే పెద్దలను వదిలిపెట్టే సమస్య లేదని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో రెడ్ హిల్స్ లో హరిత చైతన్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి మాజీ ఉద్యోగుల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు.

క్రీడా మైదానాలుగా తీర్చిదిద్దుతున్నాం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల్లో ఆక్రమణలు తొలగింపు ఒకటే తమ లక్ష్యం కాదని విషతుల్యంగా మారిన చెరువులను శుభ్రపరుస్తున్నామని, తద్వారా గుర్రపు డెక్క వంటి చెట్లు మొలవకుండా శుభ్రమైన నీరు చెరువులో ఉండే విధంగా చూస్తున్నామన్నారు. అంతేకాక చెరువుల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వాకింగ్ ట్రాక్లుగా చిన్న పిల్లలు యువత ఆడుకునే క్రీడా మైదానాలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని చెరువులను ఈ విధంగా రూపుదిద్దామని మరికొన్ని చెరువులను త్వరలో చేపడుతున్నామన్నారు . ఇప్పటివరకు హైడ్రా అనేక ఆక్రమణలు తొలగించి వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ ఆస్తులను రక్షించిందని చెప్పారు. ఈ ఏడాది సుమారు 2000 ఎకరాల ఆక్రమణలను తొలగించి రూ .లక్ష కోట్ల ఆస్తులను కాపాడాలని లక్ష్యంతో ఉన్నామన్నారు. తొలగించాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సింగరేణి మాజీ ఉద్యోగులు ఈ విధంగా హరిత చైతన్య కళాక్షేత్రం పేరుతో పర్యావరణహితానికి తోడ్పడడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

బాధ్యతగా ముందుకు కదలాలి

ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అడ్వైజర్, సీనియర్ సైంటిస్ట్ తరుణ్ కత్తుల మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉంటే పరిశ్రమలకుగాని గనులు తవ్వడానికి గాని అనుమతులు ఇవ్వడం లేదన్నారు. తీవ్ర వాతావరణ కాలుష్యంతో బాధపడుతున్న విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ కాలుష్య నివారణకు తమ వంతు బాధ్యతగా ముందుకు కదలాలన్నారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సీనియర్ సోషల్ సైంటిస్ట్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి జీవి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు పర్యావరణానికి హాని కలిగించే విధంగానే వ్యవహరిస్తున్నారని ఈ ధోరణి మారాల్నారు. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు చైతన్యవంతులు అవ్వాలని, సీనియర్ సిటిజన్స్ తమ మనవులకు బిడ్డలకు ఈ విషయంలో మార్గదర్శకంగా నిలవాలని ప్లాస్టిక్ వాడకాన్ని సమూలంగా నిర్మూలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ మాజీ డైరెక్టర్లు జేవీ దత్తాత్రేయులు, ఎ.మనోహర్, ఎస్.చంద్రశేఖర్, జీవీ.రెడ్డి పాల్గొని ప్రసంగించారు హరిత చైతన్య కళాక్షేత్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు గణాశంకర్ పూజారి తమ సంస్థ ఉద్దేశాలను వివరిస్తూ పాటల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పర్యావరణ చైతన్యం తీసుకురావడం కోసం కృషి చేస్తున్నామన్నారు అనంతరం జరిగిన సంగీత విభావరి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

Next Story