అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్ధి గల్లంతు

by Muthe.Rajitha |

ఉన్నత చదువుల కోసం ఉత్తరాఖండ్ వెళ్లిన ఒక హైదరాబాద్ విద్యార్థి ప్రమాదవశాత్తూ అలకనంద నదిలో గల్లంతయ్యాడు.

అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్ధి గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉన్నత చదువుల కోసం ఉత్తరాఖండ్ వెళ్లిన ఒక హైదరాబాద్ విద్యార్థి ప్రమాదవశాత్తూ అలకనంద నదిలో గల్లంతయ్యాడు. ఎన్‌ఐటీ (NIT) ఉత్తరాఖండ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఆనంద్ మోహన్, ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ మోహన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి అలకనంద నది తీరానికి వెళ్లాడు. సరదాగా గడిపే క్రమంలో, నది ఒడ్డున ఉన్న ఒక ఎత్తైన ప్రదేశం నుండి ఆనంద్ నీటిలోకి దూకగా.. ఎంతసేపటికీ నీటిపైకి రాకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు వెంటనే స్థానిక పోలీసులకు, కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాత్రి వరకు గాలింపు చేపట్టినప్పటికీ ఆనంద్ ఆచూకీ లభించలేదు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, వెలుతురు లేకపోవడంతో గాలింపును నిలిపివేసారు. హైదరాబాద్ లో ఉంటున్న ఆనంద్ మోహన్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా ఉన్నత చదువులు చదివి గొప్పవాడవుతాడనుకున్న తమ కుమారుని మిస్సింగ్ వార్త విని మోహన్ పేరెంట్స్ దిగ్భ్రాంతి చెందారు.

Next Story