జనవరి-మార్చిలో 7 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!

by Disha Web |
జనవరి-మార్చిలో 7 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!
X

ముంబై: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు 70,623 యూనిట్ల అమ్మకాలతో సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయని ప్రాప్‌టైగర్ నివేదిక వెల్లడించింది. 2020లో కొవిడ్-19 మహమ్మారి తర్వాత ఒక త్రైమాసికంలో ఇదే అత్యధికమని ప్రాప్‌టైగర్ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, గతేడాది ఇదే త్రైమాసికంలో విక్రయిన వాటి కంటే కూడా ఈసారి 7 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అత్యల్పంగా 15,968 యూనిట్ల అమ్మకాలు జరగ్గా, అప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలోనూ ఇళ్ల అమ్మకాలు వృద్ధి కనబరుస్తున్నాయని ప్రాప్‌టైగర్ వివరించింది.

కొత్తగా పూర్తయిన ఇళ్లు సమీక్షించిన త్రైమాసికంలో గణనీయంగా పెరిగాయి. 2021, ఇదే కాలంలో మొత్తం 53,037 యూనిట్లు కొత్తగా ప్రారంభవగా, ఈసారి 79,532 యూనిట్లకు పెరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు గృహ నిర్మాణ రంగం కీలకమైన తోడ్పాటునందిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి బయటపడుతోంది. రానున్న నెలల్లో సాధారణ కార్యకలాపాలను నిర్వహించగలమని ప్రాప్‌టైగర్ గ్రూప్ సీఈఓ ధృవ్ అగర్వాలా చెప్పారు. జనవరి-మార్చి మధ్య అత్యధికంగా రూ. 45-75 లక్షల ధరలో ఉండే ఇళ్ల అమ్మకాలకు డిమాండ్ నమోదైందని, ఈ త్రైమాసికంలోని మొత్తం అమ్మకాల్లో 79 శాతం ఈ విభాగానికి చెందినవే అని నివేదిక పేర్కొంది. నగరాలా వారీగా ముంబై, పూణెలు 60 శాతం అమ్మకాలు సాధించగా, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, చెన్నై నగరాలు క్షీణతను నమోదు చేశాయి.


Next Story