జాతీయ రహదారి-65పై ఘోర రోడ్డు ప్రమాదం

by Ratna Kumari |

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-65పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

జాతీయ రహదారి-65పై ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, చిట్యాల : నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-65పై ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తెలిసిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నార్కట్‌పల్లి వైపు వెళ్తున్న డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో డి-మ్యాక్స్ వాహనం టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి డివైడర్ దాటి హైదరాబాద్ వైపు వెళ్తున్న రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కియా కారు, షిఫ్ట్ డిజైర్ కార్లను ఢీకొట్టింది. ప్రమాదంలో డిజైర్ కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అలాగే కియా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది, నేషనల్ హైవే ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.

Next Story