బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

by Nagaya |
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంపై అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు సంబంధించి ప్రొసీడింగ్ ఆదేశాలపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారం కొనసాగించనున్నట్లు పేర్కొన్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకుండా స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారంటూ ముగ్గురు ఎమ్మెల్యేలు వేర్వేరు పిటిషన్లను బుధవారం విచారించిన హైకోర్టు పై నిర్ణయం తీసుకున్నది.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారని, సభా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొన్నారు. సభా గౌరవానికి భంగం కలిగించినప్పుడు మాత్రమే సస్పెన్షన్‌ నిర్ణయాన్ని స్పీకర్ తీసుకుంటారని, కానీ ఆ విధానానికి విరుద్ధంగా ఇప్పుడు నిర్ణయం జరిగిందని హైకోర్టుకు వివరించారు. జడ్జి జోక్యం చేసుకుని ప్రొసీడింగ్ ఉత్తర్వులేవంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం నుంచి ప్రొసీడింగ్ ఉత్తర్వులు ఇంకా తమకు అందజేయలేదని బదులిచ్చారు. వార్తా పత్రికలు, మీడియా చానెళ్లు ప్రచురించిన, ప్రసారం చేసిన వార్తల ఆధారంగానే పిటిషన్లు వేసినట్లు వివరించారు.

ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వివరణ ఇస్తూ, అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సస్పెన్షన్‌కు సంబంధించి ప్రొసీడింగ్ ఉత్తర్వులను పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసి, అప్పటికల్లా ఆ ఉత్తర్వులను కోర్టుకు అందజేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు.

Next Story

Most Viewed