హిజాబ్‌ను నిషేధించాలని ఏ చట్టమూ చెప్పట్లేదు

by Web Desk |
హిజాబ్‌ను నిషేధించాలని ఏ చట్టమూ చెప్పట్లేదు
X

బెంగళూరు: హిజాబ్ ధరించడం ఇస్లాం అచారాల్లో ఉందని విద్యార్థుల తరఫున అడ్వకేట్ దేవదత్ కామత్ కోర్టుకు తెలిపారు. హిజాబ్ వివాదం పై కర్ణాటక హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కామత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పాఠశాల వస్త్రాధారణ అంశం కాలేజి అభివృద్ధి కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఇది ఆర్టికల్ 25 ను విబేధిస్తుందని అన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లోనూ ముస్లిం మహిళలకు తలను కప్పి ఉంచే వస్త్రాధారణకు అనుమతిస్తున్నారని తెలిపారు. చాలా ఏళ్లుగా విద్యార్థులు వీటిని ధరిస్తున్నారని చెప్పారు. అయితే మత ఆచారాలు ఇతరులను ఇబ్బంది పెడితే వాటిని నియంత్రించాలని తెలిపారు. వీటిని నిషేధించాలని ఏ చట్టం చెప్పిందని ప్రశ్నించారు. ఖురాన్‌లో ఉన్న ఆచారాలు అన్ని తప్పనిసరిగా పాటించాలా అని హైకోర్టు అడగ్గా, తాను అది చెప్పట్లేదని అన్నారు. ఖురాన్ ప్రకారం హిజాబ్ ధరించడం వారి విధి అని వాదించారు. విద్యార్థినులు యూనిఫాంలను పోలిన హిజాబ్‌లను ధరించాలని చూస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులను హిజాబ్ ధరించి విద్యాసంస్థల్లోకి అనుమతించాలని కోరారు. అయితే ఇస్లాంలో హిజాబ్ ధరించడం అవసరమేనా తెలుసుకోవాలని ప్రభుత్వం వాదించింది. కాగా, హైకోర్టు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్తీ మీడియాను మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. 'మేము లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాం. మీడియా మరింత బాధ్యతగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీరు వ్యవస్థలో నాల్గవ స్తంభం' అని అన్నారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.


Next Story