2 నెలలు హార్మూజ్ ఓపెన్ : ఇరాన్

by Muthe.Rajitha |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వివిధ మధ్యవర్తిత్వ దేశాల ప్రమేయంతో ఈ 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు ఖరారైనట్లు ఇరాన్ అధికారిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

Strait of Hormuz
X

Strait of Hormuz

దిశ, వెబ్ డెస్క్ : దీర్ఘకాలంగా ఇరాన్-అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణానికి తెరదించే దిశగా ఒక కీలకమైన ముసాయిదా ఒప్పందం (Memorandum of Understanding) తుది దశకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వివిధ మధ్యవర్తిత్వ దేశాల ప్రమేయంతో ఈ 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు ఖరారైనట్లు ఇరాన్ అధికారిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఒప్పందంలోని కీలక అంశాలు ఇవే..

హర్ముజ్ జలసంధి పునరుద్ధరణ

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) 60 రోజుల పాటు ఎలాంటి పన్నులు (Tolls) లేకుండా స్వేచ్ఛా నౌకాయానం కోసం తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. ఇందులో భాగంగా జలసంధిలో తాము అమర్చిన మందుపాతరలను (Mines) తొలగించేందుకు ఇరాన్ సమ్మతించింది. దానికి ప్రతిగా, ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయనున్నారు. దీనివల్ల ఇరాన్ ప్రపంచ దేశాలకు మళ్లీ స్వేచ్ఛగా చమురు విక్రయించుకునే వీలు కలుగుతుంది.

అణు కార్యక్రమాలపై చర్చలు

ఈ 60 రోజుల కాల్పుల విరమణ కాలంలో ఇరాన్ తన అణు కార్యక్రమాలను నిలిపివేయడం, యురేనియం ఎన్రిచ్మెంట్ ను పరిమితం చేయడం, తన వద్ద ఉన్న నిల్వలను వదులుకోవడం వంటి అంశాలపై ఇరుదేశాల మధ్య లోతైన చర్చలు జరగనున్నాయి. అయితే, ఇరాన్ ప్రాథమికంగా వీటికి సంబంధించి కొన్ని మౌఖిక హామీలు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది.

నిధుల విడుదల

ఈ ఒప్పందం ప్రకారం అమెరికా, దాని మిత్రదేశాలు ఇరాన్‌పై ఎలాంటి దాడులు చేయకూడదు. అదేవిధంగా ఇరాన్ కూడా అమెరికా లేదా దాని మిత్రపక్షాలపై ముందస్తు దాడులకు దిగకూడదనే నిబంధనను చేర్చారు. ఈ శాంతి ప్రక్రియలో భాగంగా ఖతార్ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్‌కు చెందిన 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.55 వేల కోట్లు) ఆస్తులను విడుదల చేసేందుకు ట్రంప్ యంత్రాంగం అంగీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా, లెబనాన్‌లో (ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య) కాల్పుల విరమణ అంశం కూడా ఈ చర్చల పరిధిలో భాగమైనట్లు తెలుస్తోంది.

బలగాల ఉపసంహరణ అప్పుడే

ఈ 60 రోజుల తాత్కాలిక వ్యవధిలో ఆర్థిక ఉపశమనం అనేది ఇరాన్ పై ఆధారపడి ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రాంతీయ రక్షణ కోసం మోహరించిన అమెరికా సైనిక దళాలు ఇప్పుడే వెనక్కి వెళ్లవని, ఇరుదేశాల మధ్య పూర్తి స్థాయి తుది ఒప్పందం కుదిరి, అది పూర్తిగా నిరూపితమైన తర్వాతే తమ బలగాల ఉపసంహరణ ఉంటుందని వాషింగ్టన్ అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఈ చర్చల మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి దేశాలు కీలక పాత్ర పోషించాయి. ఈ ఒప్పందం కనుక విజయవంతంగా అమలైతే ప్రపంచ మార్కెట్లో చమురు సంక్షోభం తగ్గడంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట లభించనుంది.

Next Story