బలహీనంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు!

by Disha Web Desk 2 |
బలహీనంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: విడి పరికరాల కొరత మెరుగుప్పడినప్పటికీ డిమాండ్ క్షీణత కారణంగా దేశీయంగా స్మార్ట్‌ఫోన్ సరఫరా ఈ ఏడాది మేలో దెబ్బతిన్నాయని ప్రముఖ పరిశ్రమ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆన్‌లైన్ విక్రయదారులు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనడం తగ్గించడంతో పలు బ్రాండెడ్ కంపెనీలు ఎక్కువ రోజుల పాటు తమ ఉత్పత్తులను సరఫరా చేయలేక పోయాయి. దీంతో సమీక్షించిన నెలలో స్మార్ట్‌ఫోన్ సరఫరా 9.2 శాతం క్షీణించింది. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి, తక్కువ మూలధన నిధుల పరిస్థితులను కంపెనీలు ఎదుర్కొంటున్నాయి.

అయితే, కొన్ని బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పటికే చాలావరకు ఉత్పత్తులను విక్రయించడానికి సిద్ధం చేశాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విభాగం ప్రతినిధి ప్రచీర్ సింగ్ అన్నారు. అత్యంత వేగంగా అమ్మకాలను నిర్వహిస్తున్న ఓ బ్రాండ్ తన స్మార్ట్‌ఫోన్ మోడళ్ల స్టాక్‌ను పూర్తి స్థాయిలో విక్రయించలేకపోతోందని ఆయన పేర్కొన్నారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, మే నెలలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమీ బ్రాండ్ 22 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉంది. దీని తర్వాత రెండో స్థానంలో శాంసంగ్‌ను వెనక్కి నెట్టి వీవో 18 శాతం వాటాతో కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయనే కంపెనీలు ఆశించడం లేదు. సరఫరా మెరుగుపడుతున్నా, 4జీ చిప్‌సెట్ సరఫరా ఇప్పటికీ సమస్యగానే ఉంది. దీనివల్లే డిమాండ్ దెబ్బతింటోందని, ఈ ఏడాదిలో తక్కువ వృద్ధి ఉండొచ్చని ప్రచీర్ సింగ్ వెల్లడించారు. ఆగష్టులో పండుగ సీజన్ ప్రారంభమైన తర్వాత స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు కొంత ఊపందుకుంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి.


Next Story