జీఎస్టీ పరిధిలోకి క్రిప్టోకరెన్సీని తెచ్చే యోచనలో కేంద్రం!

by Disha Web Desk 13 |
జీఎస్టీ పరిధిలోకి క్రిప్టోకరెన్సీని తెచ్చే యోచనలో కేంద్రం!
X

దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టోకరెన్సీలకు సంబంధించి కేంద్రం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చట్టం పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది. క్రిప్టో లావాదేవీల సేవలపై ప్రస్తుతానికి 18 శాతం జీఎస్టీని ప్రభుత్వం విధిస్తోంది. ఆర్థిక సేవల కిందకు దీన్ని పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే క్రిప్టోకరెన్సీ లావాదేవీల మొత్తం విలువ పై పన్ను విధించడానికి వీలుంటుంది.


ఇదే సమయంలో క్రిప్టోకరెన్సీ లాటరీ, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ లాంటి వాటి కిందకు వస్తాయని, కాబట్టి జీఎస్టీలో 28 శాతం విభాగంలో చేర్చాలని జీఎస్టీ అధికారులు సూచిస్తున్నారు. ఇంకొంతమంది అధికారులు క్రిప్టోలను బంగారం లాగా చూడాలని, పసిడిపై ఇప్పుడున్న 3 శాతం జీఎస్టీ విధిస్తే చాలని చెబుతున్నారు. అయితే, క్రిప్టోకరెన్సీలపై జీఎస్టీ విషయం గురించి మరింత స్పష్టత కావాల్సి ఉంటుంది.

మొత్తం విలువ పై పన్ను విధించాలా.. వద్దా అనే విషయాన్ని నిర్ధారించాలి. ఒకవేళ క్రిప్టోను వస్తువులు, సేవలుగా వర్గీకరిస్తే వాటిపై ఖచ్చితంగా పన్ను విధించాలి. మొత్తంపై విధించాల్సి వస్తే 0.1 శాతం నుంచి 1 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఈ అంశం ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉందని, ఎంత శాతం కిందకు దీన్ని వర్గీకరించాలనే విషయాన్ని ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


క్రిప్టో లపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. 2022-23 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రిప్టో ఆస్తులను ఆదాయపన్ను కిందకు తీసుకొస్తామని, దీనిపై 30 శాతం పన్ను ఉంటుందని ప్రతిపాదించారు. అలాగే, రూ. 10 వేలకు మించిన క్రిప్టో ఆస్తుల బదిలీపై 1 శాతం టీడీఎస్‌ను ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయనున్నట్టు చెప్పారు. క్రిప్టో ఆస్తులపై పన్నును ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు.


Next Story