సీఎం కేసీఆర్‌పై అసంతృప్తితో ఆ నియోజక వర్గ ప్రజాప్రతినిధులు!

by Disha Web Desk 13 |
సీఎం కేసీఆర్‌పై అసంతృప్తితో ఆ నియోజక వర్గ ప్రజాప్రతినిధులు!
X

దిశ ప్రతినిధి, సిద్దిపేట: రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందనుకున్న గజ్వేల్ నియోజక వర్గం కేవలం పట్టణ అభివృద్ధికే పరిమితమయ్యేలా కన్పిస్తోంది. సీఎం కేసీఆర్ తన స్వంత నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. జిల్లా మంత్రి హరీశ్ రావు సైతం ఈ మధ్య గజ్వేల్ లో పర్యటించడం లేదు. దీనిపై గజ్వేల్ నియోజక వర్గ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కనీసం సమస్యలు చెప్పుకునేందుకు సైతం సమయమివ్వడం లేదని ఆరోపిస్తున్నారు.

కనిపించని అభివృద్ధి..

సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు, ప్రజా ప్రతినిధులు అలకబూనారు. గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్, తుప్రాన్, కొండపాక, వర్గల్, ములుగు, జగదేవపూర్ మండలాలు ఉన్నాయి. వీటిలో గజ్వేల్ పట్టణం మినహా మిగతా మండల కేంద్రాలు, గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కానరావడం లేదు. ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. నిజానికి సీఎం నియోజకవర్గమంటే అందరికీ తమ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందనే ఆశ ఉంటుంది. కానీ గజ్వేల్ లో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రమంతటా జరిగే అభివృద్ధి పనులు మినహా కొత్తగా అభివృద్ధి పనులేమి జరగడం లేదు.

సీఎంపై ప్రజాప్రతినిధుల అలక..

సీఎం కేసీఆర్ తీరుపై గజ్వేల్ నియోజక వర్గ ప్రజాప్రతినిధులు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలినాళ్లలో గజ్వేల్ పై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని, చేసిన పనులకు సైతం నిధులు రావడం లేదని వాపోతున్నారు. మొదటి ప్రభుత్వ హయంలో గజ్వేల్ నియోజక వర్గ ప్రజాప్రతినిధులతో కలిసి ఒక్క రోజంతా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రి హరీశ్ రావు, జిల్లా అధికార బృందంతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ గ్రామగ్రామాన నెలకొన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో కాస్త అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత మరలా ఎలాంటి అభివృద్ధి కన్పించడం లేదని ఆ నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.

సమయమివ్వట్లే..

తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యల గూర్చి సీఎంకు విన్నవించుకుందామంటే తమకు సమయమివ్వడం లేదని కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు ముచ్చటించుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులం కావడంతో ఏమి చేయలేకపోతున్నామని, సీఎం కేసీఆర్‌పై నమ్మకంతో స్వంత డబ్బులు వెచ్చించి గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టామని, ప్రస్తుతం దానికి సంబంధించిన డబ్బులు కూడా రావడం లేదని, బయట అప్పుకు తెచ్చిన వడ్డీ పెరుగుతుందని, వెంటనే సీఎం కేసీఆర్ తమకు సమయం కేటాయించాలని నియోజక వర్గ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. జిల్లా మంత్రి హరీశ్ రావు సైతం తమ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించి గజ్వేల్ పట్టణంతో పాటు అన్ని మండలాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed