వరుసగా మూడో త్రైమాసికంలో భారీగా నిధులు సాధించిన దేశీయ స్టార్టప్‌లు

by Dishanational2 |
వరుసగా మూడో త్రైమాసికంలో భారీగా నిధులు సాధించిన దేశీయ స్టార్టప్‌లు
X

ముంబై: ప్రస్తుత ఏడాది మొదటి మూడు నెలల్లో దేశీయంగా 14 స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ హోదాను దక్కించుకున్నాయని ఓ నివేదిక తెలిపింది. అంతేకాకుండా వరుసగా మూడో త్రైమాసికంలోనూ స్టార్టప్ కంపెనీలు 10 బిలియన్ డాలర్ల(రూ. 75 వేల కోట్ల)కు పైగా నిధులను అందుకున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తగా 14 కంపెనీలు 1 బిలియన్ డాలర(రూ. 7,500 కోట్ల) విలువను దక్కించుకోవడంతో భారత్‌లో మొత్తం యూనికార్న్ కంపెనీల సంఖ్య 84కి చేరుకున్నాయి. నివేదిక ప్రకారం ఈ త్రైమాసికంలో మొత్తం రూ. 82 వేల కోట్ల నిధులను స్టార్టప్ కంపెనీలు ఆర్జించాయి. ఇందులో గరిష్ఠంగా 3.5 బిలియన్ డాలర్ల(రూ. 26.5 వేల కోట్ల) కంటే ఎక్కువ నిధులను సాఫ్ట్‌వేర్-యాజ్-ఏ-సర్వీస్(సాస్) కంపెనీలు దక్కించుకున్నాయి. అంతేకాకుండా ఈ రంగం మొత్తం ఐదు యూనికార్న్ కంపెనీలతో అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ భారత స్టార్టప్ కంపెనీలు మూలధనాన్ని ఆకర్షిస్తూనే ఉన్నాయని, ముఖ్యంగా ప్రారంభ దశలోనే ఈ కంపెనీలు గణనీయంగా నిధులను సాధించగలుగుతున్నాయని ప్రముఖ స్టార్టప్ కన్సల్టెంట్ అమిత్ నాకా చెప్పారు.


Next Story