వంట నూనె ధరలు తగ్గించేందుకు అంగీకరించిన తయారీ కంపెనీలు!

by Disha Web Desk 12 |
వంట నూనె ధరలు తగ్గించేందుకు అంగీకరించిన తయారీ కంపెనీలు!
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా వంటనూనె ధరలను తగ్గించే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం తయారీ కంపెనీలతో బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రముఖ వంట నూనె తయారీ కంపెనీలు ధరలు తగ్గించేందుకు అంగీకరించాయి. దీంతో దేశీయంగా వంట నూనె ధరలు సుమారు 10-15 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత నెలరోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనె ధరలు దిగొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, కాబట్టి దేశీయంగా ఉన్న కంపెనీలు సైతం ఈ తగ్గింపును వినియోగదారులకు అందించాలని స్పష్టం చేశామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పలు కంపెనీలు రిటైల్ మార్కెట్లో ధరల తగ్గిస్తున్నాయి.

ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం అదానీ విల్మార్, మదర్ డైరీ వివిధ రకాల వంటనూనె ధరలను లీటర్‌కు రూ. 10-15 తగ్గించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, జూన్‌లో వేరుశెనగ నూనె మినహా ప్యాకేజ్‌డ్ వంటనూనె సగటు రిటైల్ ధరలు లీటర్‌కు రూ. 150-190 మధ్య తగ్గాయి. గత నెలలో టన్నుకు రూ. 27,600 నుంచి రూ. 35,500 వరకు వివిధ వంటనూనె ధరలు తగ్గాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇండోనేషియా, మలేషియాల నుంచి పామాయిల్, రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి పొద్దుతిరుగుడు నూనెతో సహా భారత్ తన వార్షిక వంటనూనె వినియోగంలో 60 శాతం దిగుమతి చేసుకుంటోంది.



Next Story

Most Viewed